నా కుటుంబంతో కటీఫ్
ప్రతీకాత్మక చిత్రం
సంబంధాలు తెంచుకుంటున్నా
రాజకీయాల నుంచి వైదొలుగుతున్నా
లాలూ కుమార్తె రోహిణి ఆచార్య
పాట్నా: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) వ్యవస్థాపకులు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అంతేకాక, ఆమె తన కుటుంబంతో సంబంధాలు తెంచుకుంటున్నట్లు శనివారం వెల్లడించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ కేవలం 25 సీట్లు మాత్రమే గెలుచుకుని భారీ ఓటమి చవిచూసిన మరుసటి రోజే ఈ ప్రకటన వచ్చింది. ఈ మొత్తం పరిణామాలకు బాధ్యత వహిస్తూ, రోహిణి.. తేజస్వీ యాదవ్ సన్నిహితులు సంజయ్ యాదవ్, రమీజ్లే కారణమని వ్యాఖ్యానించారు. వారు తనను రాజీనామా చేయాలని, కుటుంబంతో సంబంధాలు తెంచుకోవాలని అడిగారని ఆరోపించారు. ‘నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను నా కుటుంబాన్ని వదిలేస్తున్నాను. సంజయ్ యాదవ్ రమీజ్ నన్ను ఇదే చేయమని అడిగారు. అందుకే ఈ నిందనంతా నేనే తీసుకుంటున్నాను’ అని రోహిణి 'ఎక్స్' వేదికగా పోస్ట్ చేశారు. రోహిణి వైద్య పట్టభద్రురాలు. వివాహం తర్వాత గృహిణిగా మారి సింగపూర్లో స్థిరపడ్డారు. ఆమె తన తండ్రికి కిడ్నీ దానం చేసి ప్రజల గౌరవాన్ని పొందారు. ఆర్జేడీ శిబిరంలో ఆమెకు ప్రభావవంతమైన వాయిస్ ఉంది. గత సంవత్సరం, ఆమె తన తండ్రి గతంలో ప్రాతినిథ్యం వహించిన సారన్ లోక్సభ స్థానం నుంచి ఆర్జేడీ టికెట్పై పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రాజీవ్ ప్రతాప్ రూడీ చేతిలో ఓడిపోయారు. అయితే, ప్రస్తుతం రోహిణి వ్యాఖ్యలు యాదవ్ కుటుంబంలో ఉన్న విభేదాలను బహిర్గతం చేశాయి. ఈ సంవత్సరం మొదట్లో, లాలూ ప్రసాద్ తన పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ను ఒక సోషల్ మీడియా పోస్ట్ వివాదం కారణంగా ఆరు సంవత్సరాలపాటు పార్టీ నుంచి బహిష్కరించారు. బహిష్కరణ తర్వాత, తేజ్ ప్రతాప్ జనశక్తి జనతా దళ్ అనే కొత్త పార్టీని స్థాపించి, ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. అంతేకాక, ఆయన తేజస్వీ యాదవ్కు వ్యతిరేకంగా కూడా అభ్యర్థిని నిలబెట్టారు. అయితే, ఆయన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. తేజ్ ప్రతాప్ కూడా తన సొంత స్థానం మహువాలో ఓడిపోయారు.