ముంచుకొస్తున్న సెన్యార్
అచ్చెన్నాయుడు
రైతులను అప్రమత్తం చేసిన అచ్చెన్నాయుడు
వైజాగ్, నవంబర్ 25 (ఈవార్తలు): ఏపీ తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం, వాయుగుండంగా మారి రానున్న 48 గంటల్లో తుపానుగా బలపడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. పంట నష్టం జరగకుండా రైతులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. ముఖ్యంగా వరి కోతలు పూర్తిచేసిన రైతులు, తమ ధాన్యాన్ని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు ప్రభుత్వం తరఫున రైతులకు ఉచితంగా టార్పలిన్ పట్టాలు పంపిణీ చేస్తున్నామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. రైతులు జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించి వాటిని పొందవచ్చని తెలిపారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. సముద్రం అలజడిగా ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వెంటనే తీరానికి తిరిగి రావాలని ఆదేశించారు. ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
ఏపీకి భారీ వర్ష సూచన
మలేషియా, మలక్కా జలసంధి పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్న ఈ వ్యవస్థ, రాబోయే 24 గంటల్లో అండమాన్ సముద్రంలో వాయుగుండంగా బలపడనుంది. ఈ వాయుగుండం మరింత తీవ్రరూపం దాల్చి తుపానుగా మారనుంది. ఈ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, యానాంలో నవంబర్ 29న భారీ వర్షాలు, నవంబర్ 30న అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.