నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
ప్రతీకాత్మక చిత్రం
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ, దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. రోజంతా ఒడుదొడుకులతో సాగిన ట్రేడింగ్లో సెన్సెక్స్ 331.21 పాయింట్లు నష్టపోయి 84,900.71 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ కూడా 108.65 పాయింట్లు క్షీణించి కీలకమైన 26,000 మార్కు దిగువన 25,959.5 వద్ద ముగిసింది. నిఫ్టీ 26,000 దిగువన ముగియడం మార్కెట్ సెంటిమెంట్ను బలహీనపరిచిందని, దీనివల్ల సూచీ 25,800–25,750 స్థాయిల వరకు పడిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మార్కెట్ తిరిగి పుంజుకోవాలంటే నిఫ్టీ తప్పనిసరిగా 26,150 స్థాయిని దాటాలని వారు అభిప్రాయపడ్డారు. మరోవైపు, రూపాయి విలువలో కొంత రికవరీ కనిపించింది. శుక్రవారం చరిత్రాత్మక కనిష్ఠ స్థాయి 89.65కు పడిపోయిన రూపాయి, ఈరోజు 35 పైసలు బలపడి 89.20 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. రానున్న రోజుల్లో రూపాయి 88.75–89.50 శ్రేణిలో కదలాడవచ్చని నిపుణులు భావిస్తున్నారు.