మీ సిమ్కు మీరే బాధ్యులు
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: సిమ్ కార్డు వినియోగంపై టెలికం విభాగం కీలక ప్రకటన చేసింది. సిమ్ కార్డు దుర్వినియోగానికి గురైనట్లు తేలితే సిమ్ కార్డు యజమానే బాధ్యుడు అని స్పష్టం చేసింది. సిమ్ కార్డుల దుర్వినియోగం విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ట్యాంపర్ చేసిన ఐఎమ్ఈఐ మొబైల్ డివైజుల వాడకానికి దూరంగా ఉండాలని తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ఒకవేళ మీ పేరుతో ఉన్న సిమ్ కార్డు సైబర్ నేరాలకు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించినట్లు తేలితే, నేరస్థుడితో పాటు మీరు కూడా బాధ్యత వహించాల్సిందే’నని టెలికం శాఖ తేల్చిచెప్పింది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్లో పోస్టు చేసింది. ‘ఐఎంఈఐ ట్యాంపర్ చేసిన మోడెమ్లు, మాడ్యూల్స్, సిమ్ బాక్సులను కొనుగోలు చేయడం, ఉపయోగించడం నేరం. సంచార్ సాథి పోర్టల్ ద్వారా మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోండి. నకిలీ పత్రాలతో సిమ్ కార్డులు కొనుగోలు చేయడం, లేదా మీ పేరుమీద తీసుకున్న సిమ్ కార్డులను వేరొకరికి ఇవ్వడం కూడా చట్ట విరుద్ధం. సిమ్ను దుర్వినియోగం చేస్తే, నేరానికి పాల్పడ్డ వ్యక్తితో పాటు అసలు సిమ్ యజమానిపై కూడా అదే విధమైన చర్యలు తీసుకుంటారు. కాల్ లైన్ ఐడెంటిటీ లేదా టెలికం గుర్తింపులను మార్చే యాప్లు, వెబ్సైట్లను ఉపయోగించకూడదు’ అని హెచ్చరించింది