భారత మహిళకు చైనా వేధింపులు
ప్రతీకాత్మక చిత్రం
పాస్పోర్ట్పై అరుణాచల్ అని ఉండటమే కారణం
అరుణాచల్ చైనాలో భాగం అంటూ 18 గంటలు నిర్బంధం
భారత కాన్సులేట్ జోక్యంతో సురక్షితంగా బయటపడ్డ మహిళ
న్యూఢిల్లీ/షాంగై: భారత సంతతికి చెందిన అరుణాచల్ ప్రదేశ్ మహిళకు చైనాలో తీవ్ర అవమానం ఎదురైంది. ఆమె భారత పాస్పోర్ట్పై పుట్టిన ప్రదేశంగా అరుణాచల్ ప్రదేశ్ అని ఉండటాన్ని చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు అంగీకరించలేదు. ఆమెను గంటల తరబడి నిర్బంధించి, తీవ్రంగా వేధించారు. యూకేలో నివసించే ప్రేమ వాంగ్జోమ్ థోంగ్డోక్ అనే మహిళ నవంబర్ 21న లండన్ నుంచి జపాన్కు వెళ్లే క్రమంలో షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో ఆగారు. కేవలం మూడు గంటల విరామం కోసం అక్కడ దిగిన ఆమెకు ఇమ్మిగ్రేషన్ కౌంటర్లో ఊహించని పరిణామం ఎదురైంది. ఆమె పాస్పోర్ట్ను చూసిన చైనా అధికారులు ‘అరుణాచల్ ప్రదేశ్ చైనాలో అంతర్భాగం, కాబట్టి మీ పాస్పోర్ట్ చెల్లదు’ అని వాదించారు. ఆమె పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకుని, జపాన్కు వెళ్లాల్సిన విమానాన్ని ఎక్కకుండా అడ్డుకున్నారు. దీంతో ఆమె యూకేలోని తన స్నేహితుడి ద్వారా షాంఘైలోని భారత కాన్సులేట్ను సంప్రదించారు. విషయం తెలుసుకున్న భారత అధికారులు వెంటనే జోక్యం చేసుకుని, ఆమెను సురక్షితంగా అక్కడి నుంచి పంపించే ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనపై ప్రేమ వాంగ్జోమ్ ప్రధాని నరేంద్ర మోదీకి, ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, బాధ్యులైన ఇమ్మిగ్రేషన్, ఎయిర్లైన్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
చైనాకు దీటుగా బదులిచ్చిన భారత్
మహిళ నిర్బంధం ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ బీజింగ్, ఢిల్లీలోని చైనా అధికారుల వద్ద నిరసన తెలిపింది. ‘ఒక భారత ప్రయాణికురాలిని అర్థంలేని కారణాలతో నిర్బంధించడం దారుణం. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో విడదీయలేని భాగం. అక్కడి పౌరులకు భారత పాస్పోర్ట్తో ప్రయాణించే పూర్తి హక్కు ఉంది. చైనా చర్యలు అంతర్జాతీయ పౌర విమానయాన ఒప్పందాలకు విరుద్ధం’ అని ఓ సీనియర్ అధికారి స్పష్టం చేశారు.