21,00,000
ప్రతీకాత్మక చిత్రం
మొబైల్ నంబర్లు డిస్కనెక్ట్
బ్లాక్ లిస్టులో లక్ష సంస్థలు
స్పామ్ కాల్స్పై ట్రాయ్ కొరడా
డీఎన్డీలో రిపోర్ట్ చేయాలని సూచన
న్యూఢిల్లీ: స్పామ్, మోసపూరిత కాల్స్ను అరికట్టేందుకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) భారీ చర్యలు చేపట్టింది. గత ఏడాది కాలంలో ఏకంగా 21 లక్షలకు పైగా మొబైల్ నంబర్లను డిస్కనెక్ట్ చేయడంతో పాటు, మోసాలకు పాల్పడుతున్న సుమారు లక్ష సంస్థలను బ్లాక్లిస్ట్లో పెట్టినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు ట్రాయ్ స్పష్టం చేసింది. టెలికాం సేవలు దుర్వినియోగం కాకుండా నిరోధించేందుకు, ప్రజలు తమకు వచ్చే స్పామ్ కాల్స్, మెసేజ్ల వివరాలను 'ట్రాయ్ డీఎన్డీ' యాప్ ద్వారా రిపోర్ట్ చేయాలని కోరింది. చాలా మంది వినియోగదారులు తమ ఫోన్లలో అనవసర నంబర్లను బ్లాక్ చేస్తే సరిపోతుందని భావిస్తారని, కానీ అది సరైన పద్ధతి కాదని ట్రాయ్ పేర్కొంది. నంబర్ను బ్లాక్ చేయడం వల్ల ఆ కాల్స్ వ్యక్తిగతంగా మనకు రాకుండా ఉంటాయి తప్ప, మోసగాళ్లు ఇతరులను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఆపలేమని వివరించింది. అదే డీఎన్డీ యాప్లో ఫిర్యాదు చేయడం ద్వారా టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఆ నంబర్ను గుర్తించి, దానిని శాశ్వతంగా నిలిపివేస్తారు. గతేడాది ఇంత పెద్ద సంఖ్యలో నంబర్లపై చర్యలు తీసుకోవడానికి లక్షలాది మంది పౌరులు డీఎన్డీ యాప్ను ఉపయోగించడమే కారణమని ట్రాయ్ తెలిపింది. ఆర్థిక మోసాలు, సైబర్ నేరాల బారిన పడితే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930కి లేదా cybercrime.gov.in పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచించింది. అలాగే 'సంచార్ సాథీ' పోర్టల్లోని 'చక్షు' ద్వారా కూడా టెలికాం సంబంధిత మోసాలను రిపోర్ట్ చేయవచ్చు. సీనియర్ సిటిజన్లు, మహిళలు, డిజిటల్ లావాదేవీలపై అవగాహన తక్కువగా ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది