టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ మండలి.. టికెట్ల అమ్మకాలను సైతం ప్రారంభించింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ప్రపంచకప్ టికెట్లు గురువారం సాయంత్రం 6:45 నుంచి అందుబాటులోకి వచ్చాయి.
ప్రతీకాత్మక చిత్రం
నిన్న సాయంత్రం నుంచే అమ్మకం షురూ
భారత్-యూఏఈ మ్యాచ్ టికెట్ విడుదల చేసిన సూర్య, రవిశాస్త్రి
టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ మండలి.. టికెట్ల అమ్మకాలను సైతం ప్రారంభించింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ప్రపంచకప్ టికెట్లు గురువారం సాయంత్రం 6:45 నుంచి అందుబాటులోకి వచ్చాయి. అభిమానులను భారీగా స్టేడియాలకు రప్పించాలనే ఉద్దేశంతో టికెట్ కనీస ధరను రూ.100గా నిర్ణయించామని ఐసీసీ సీఈఓ సనోజ్ గుప్తా వెల్లడించారు. భారత గడ్డపై ఫిబ్రవరి 7న టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. రెండు దేశాల్లోని ఎనిమిది నగరాల్లో ఈ మెగా టోర్నీ జరుగనుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో షెడ్యూల్ను ప్రకటించిన ఐసీసీ గురువారం మ్యాచ్ టికెట్ల అమ్మకాలకు తెరతీసింది. టికెట్ల కోసం https://tickets.cricketworldcup.com సైట్లోకి వెళ్లాలి. ఈ సైట్ అడ్రస్పై క్లిక్ చేస్తే నేరుగా ‘బుక్మైషో’ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో ఈ బిగ్ ఈవెంట్ టికెట్లను కొనుక్కోవచ్చు. రూ.100 నుంచి మ్యాచ్ టికెట్ ధర షురూ కానున్నందున భారీగా అమ్ముడుపోతాయని ఐసీసీ భావిస్తోంది. ‘టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్ రూ.100 తో ప్రారంభమవడం టోర్నీపై ఆసక్తిని పెంచేస్తుంది. ఆధునిక వసతులు, స్టేడియంలో సందడితో క్రికెట్ను ఎంతో ప్రేమించే భారతీయులకు వరల్డ్ క్లాస్ మ్యాచ్ అనుభూతి కలిగిస్తాం. క్రీడాభిమానులందరూ ఒకచోట కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు ఈ టోర్నీ మహత్తర అవకాశం. ఈ విశ్వ క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని రాష్ట్రాల బోర్డులు, సంస్థలతో సహకారం తీసుకుంటున్నాం. వరల్డ్ కప్ మ్యాచ్లను చూసి జీవితకాల జ్ఞాపకాలను మిగిల్చుకునేందుకు వచ్చే భారత, విదేశీ అభిమానుకులకు స్వాగతం పలుకుతున్నాం’ అని సనోజ్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపాడు.
20 జట్లు 4 గ్రూప్లు
భారత్, శ్రీలంక గడ్డపై వచ్చే ఏడాది జరుగబోయే పురుషుల పొట్టి ప్రపంచకప్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. ఫిబ్రవరి 7 నుంచి టోర్నీ షురూ కానుండగా.. అదే రోజు రాత్రి 7 గంటలకు ముంబైలో భారత్, అమెరికా తలపడనున్నాయి. అర్హత సాధించిన 20 జట్లను గ్రూప్లుగా విభించింది ఐసీసీ. ఒక్కదాంట్లో ఐదు చొప్పున నాలుగు గ్రూప్లను చేసింది. ఆతిథ్య దేశమైన టీమిండియా గ్రూప్లో పాకిస్థాన్ మాత్రమే పెద్ద జట్టు. కానీ, శ్రీలంక గ్రూప్లో ఆస్ట్రేలియా ఉండడంతో ఆ జట్టుకు కఠిన సవాల్ ఎదురవ్వనుంది. ఇక గ్రూప్ 3లో ఇంగ్లండ్, వెస్టిండీస్.. గ్రూప్ 4లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వంటి టెస్టు క్రికెట్ ఆడే జట్లు ఉన్నాయి.
గ్రూప్ -1 : భారత్, పాకిస్థాన్, నెదర్లాండ్స్, నమీబియా, యూఎస్ఏ.
గ్రూప్ -2 : శ్రీలంక, ఆస్ట్రేలియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్.
గ్రూప్ -3 : ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ.
గ్రూప్ -4 : దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్థాన్, యూఏఈ, కెనడా.
లీగ్ దశ మ్యాచ్ తేదీలు.. వేదిక.. సమయం వివరాలు
ఫిబ్రవరి 7 - పాకిస్థాన్ వర్సెస్ నెదర్లాండ్స్ - కొలంబో, ఉదయం 11:00 గంటలకు.
ఫిబ్రవరి 7 - వెస్టిండీస్ వర్సెస్ బంగ్లాదేశ్ - కోల్కతా, మధ్యాహ్నం 3:00 గంటలకు.
ఫిబ్రవరి 7 - భారత్ వర్సెస్ యూఎస్ఏ - ముంబై , రాత్రి 7:00 గంటలకు.
ఫిబ్రవరి 8 - ఇంగ్లండ్ వర్సెస్ నేపాల్ - ముంబై, రాత్రి 7:00 గంటలకు.
ఫిబ్రవరి 8 - శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్ - కొలంబో, రాత్రి 7:00 గంటలకు.
ఫిబ్రవరి 9 - బంగ్లాదేశ్ వర్సెస్ ఇటలీ - కోల్కతా, ఉదయం 11:00 గంటలకు.
ఫిబ్రవరి 9 - జింబాబ్వే వర్సెస్ ఒమన్ - కొలంబో, మధ్యాహ్నం 3:00 గంటలకు.
ఫిబ్రవరి 10 - పాకిస్థాన్ వర్సెస్ యూఎస్ఏ - కొలంబో, రాత్రి 7:00 గంటలకు.
ఫిబ్రవరి 11 - ఆస్ట్రేలియా వర్సెస్ ఐర్లాండ్ - కొలంబో, మధ్యాహ్నం 3:00 గంటలకు.
ఫిబ్రవరి 11 - ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ - ముంబై, రాత్రి 7:00 గంటలకు.
ఫిబ్రవరి 12 - శ్రీలంక వర్సెస్ ఒమన్ - క్యాండీ, ఉదయం 11:00 గంటలకు.
ఫిబ్రవరి 12 - భారత్ వర్సెస్ నమీబియా - ఢిల్లీ, రాత్రి 7:00 గంటలకు.
ఫిబ్రవరి 13 - ఆస్ట్రేలియా వర్సెస్ జింబాబ్వే - కొలంబో, ఉదయం 11:00 గంటలకు.
భారత మ్యాచ్ టికెట్తో సూర్య
భారత గడ్డపై వరల్డ్ కప్ తొలి టికెట్లను అనుకున్న సమయం కంటే ముందుగానే విడుదల చేశారు. భారత్, దక్షిణాఫ్రికా రెండో టీ20 మ్యాచ్ టాస్ పూర్తయ్యాక మైదానంలోనే ప్రపంచకప్ టికెట్లతో ఇరుజట్ల కెప్టెన్లు ఫొటోలు దిగారు. పొట్టి ప్రపంచకప్ ఆరంభం రోజే భారత్, యూఎస్ఏతో తలపడనుంది. ఆ మ్యాచ్ టికెట్ను కామెంటేటర్ రవి శాస్త్రి, టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కలిసి విడుదల చేశారు. ఇద్దరూ నవ్వలు చిందిస్తూ ఆ టికెట్తో ఫొటో దిగారు. సఫారీ లెజెండ్ డేల్ స్టెయిన్, మర్క్రమ్ సైతం తమ జట్టు తొలి పోరు టికెట్తో మురిసిపోయారు. దక్షిణాఫ్రికా, కెనడా మ్యాచ్ టికెట్తో వీరిద్దరూ కెమెరాకు ఫోజిచ్చారు.