ఏమైనా అనుకోండి.. పిచ్చివాళ్లని నిందించుకోండి... వెర్రిబాగుల వాళ్లని వెక్కిరిం చండి... వంటిమీద నూలుపోగైనా లేకుండా తిరుగుతున్నారని ఆక్షేపించండి... శరీరంనిండా విభూతి రాసుకున్నారని నొసలు నొక్కుకొండి.. హుక్కా పీలుస్తున్నారంటూ ఆశ్చర్యపోండి... మీరేమనుకున్నా వారికి మీ ఊసులు అక్కరలేదు.. వారికి మీ అభిప్రాయాలతో పని లేదు.. వారికి లోకంతో పని లేదు.. లోకం తమ గురించి ఎన్ని మాట్లాడుకున్నా వారికి అవసరం లేదు.. ఎవరు వారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ ఉంటారు? ఏం చేస్తారు?
నాగా సాధువులు
హుక్కా.. గుట్కా. నార్కోటిక్స్..
ప్రతీదీ వాళ్లకు ప్రసాదమే..
ఎండా.. వానా.. చలి..
అన్ని కాలాల్లో ఆనందమే..
ఒంటిపై నూలుపోగు ఉండదు.
విభూతే వారికి వస్త్రం.. త్రిశూలమే అస్త్రం..
అందరూ ఈశ్వరుడి ప్రతిరూపాలే..
ఏమైనా అనుకోండి.. పిచ్చివాళ్లని నిందించుకోండి... వెర్రిబాగుల వాళ్లని వెక్కిరిం చండి... వంటిమీద నూలుపోగైనా లేకుండా తిరుగుతున్నారని ఆక్షేపించండి... శరీరంనిండా విభూతి రాసుకున్నారని నొసలు నొక్కుకొండి.. హుక్కా పీలుస్తున్నారంటూ ఆశ్చర్యపోండి... మీరేమనుకున్నా వారికి మీ ఊసులు అక్కరలేదు.. వారికి మీ అభిప్రాయాలతో పని లేదు.. వారికి లోకంతో పని లేదు.. లోకం తమ గురించి ఎన్ని మాట్లాడుకున్నా వారికి అవసరం లేదు.. ఎవరు వారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ ఉంటారు? ఏం చేస్తారు? ఇంటి నుంచి బయటకు కాలు మోపితే, అంతా మనల్నే చూడాలని ఎంత తాపత్రయ పడతాం? ఆడామగా తేడా లేకుండా అద్దం ముందు నిలబడి గంటల తరబడి తయారవటం తెలిసిందే.. ఒంటి అలంకారం కోసం వాడే కాస్మోటిక్స్ అన్నీ ఇన్నీ కావు. పర్ఫ్యూమ్స్ గురించయితే చెప్పనే అక్కర్లేదు.. వంద గ్రాముల పర్ఫ్యూమ్ను వంద పదులైనా సరే కొనటానికి వెనుకాడం. కానీ, ఇవన్నీ అక్కరలేని జాతి నాగా. ఇది మన దేశంలోనే ఉంది.. మన మధ్యలోనే ఉంది.. ఆ జాతికి వీటితో పనే లేదు.. ఎవరితోనూ ఆ జాతికి సంబంధమూ లేదు.. వారు ఎవరికీ అర్థం కారు.. ఎవరి అపార్థాలతో వారికి పని లేదు.. అలంకారాలు అక్కర లేదు.. జుట్టు జడలు కట్టినా పట్టింపులేదు.. ఆహార్యం ప్రధానం కాదు.. నగ్నత్వమే వారి వేషం.. ఆహారం ముఖ్యం కాదు.. దొరికిందే తింటే చాలు.. రుచితో పనిలేదు.. శరీరంపై మోహం లేదు.. మృత్యువంటే భయం లేదు.. హిమాలయ సానువుల్లో నివాసం... పుష్కరం వస్తేనే జనంలోకి ప్రవాహం.. అడుక్కునే వాళ్లంటూ తిట్టేవాళ్లున్నారు.. అవధూతలని అర్చించేవారూ ఉన్నారు.. ఎవ్వరితోనూ వారికి అవసరం లేదు.
సాధారణంగా మనం నిత్యం చూసే సాధు సంతులకు కాషాయం, కమండలం, దండం అస్తిత్వాలు.. మిగతా రెంటి మాటెలా ఉన్నా, కాషాయం సన్యాసానికి ఒక విధంగా యూనిఫామ్ లాంటిది. ఎందుకంటే కాషాయం త్యాగానికి చిహ్నం. సన్యాసులు అన్నింటినీ త్యాగం చేసి వెళ్తారు కాబట్టి, సాధారణంగా వారు కాషాయాన్నే ధరిస్తారు.. ఇది కామన్ ఎలిమెంట్.. ఇందులో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు.. కానీ ఎవరికీ అంతుపట్టని సాధువుల సమాజం వాళ్లది.. అది అత్యంత రహస్య సమాజం. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఎక్కడ ఉన్నాయో తెలియని అఖారాల్లో ఉండే సాధు జాతి.. దాని పేరు నాగా, ఆ సన్యాసులే నాగా సాధువులు. మిగతా సొసైటీతో వీరికి ఎలాంటి సంబంధం లేదు.. తమ లోకంలోనే వారు జీవిస్తుంటారు.. అన్నింటినీ వదిలిపెట్టేసిన వారు.. చివరకు శరీరంపై బట్టల్నీ విడిచిపెట్టిన వాళ్లు.. నాగా సాధువులు. వీరు జనావాసాల్లోకి పుష్కరాల సమయంలోనే వస్తారు.. ఒకే ఒక్క ఊరేగింపుగా వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించి పుష్కరాలు పూర్తికాగానే తిరిగి వారి ఆవాసాలకు వెళ్లిపోతారు. అంతే కాదు.. జనం మధ్యలోకి వచ్చినప్పుడు వీరి చేష్టలు విచిత్రంగా ఉంటాయి.. విడ్డూరంగా కనిపిస్తాయి.. త్రిశూలాలు ధరిస్తారు.. కత్తులు పట్టుకుంటారు.. వాటితో వీరంగం వేస్తారు.. వీరనాట్యాలు చేస్తారు.. కర్రసాము చేస్తారు.. హుక్కా, చిలుమ్ వంటి వాటి ద్వారా పొగాకు, నార్కొటిక్స్ వంటివి పీలుస్తారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని సాధువులని పిలవటం ఏమిటి? అదే మిస్టరీ... అతి కఠినమైన యోగ సాధనకు పరాకాష్ట.. సభ్య సమాజానికి ఏవైతే నిషేధాలో... అవన్నీ వారు చేస్తారు.. బట్టలు ధరించకపోవటమే ఒక సమస్య అనుకుంటే, హుక్కా, చిలుమ్ పీల్చటం, ఏది పడితే అది తినేయటం, ఒంటిని శుభ్రంగా కూడా ఉంచుకోకపోవటం, అన్నీ నెగెటివ్ షేడ్సే.. ఏమిటీ రహస్యం? పవిత్ర గంగా తీరంలో పుష్కరాలు వచ్చినప్పుడు నాగా సాధువులు విభూతి అలంకారాలతో శివ పంచాక్షరి నినదిస్తూ రావడం ఒక అపురూప సన్నివేశం.
హిమాలయాలు.. దేవతల ఆవాసాలంటారు.. నాగా సాధువులు ఉండేది కూడా ఈ హిమాలయాల పర్వత శ్రేణుల్లోనే.. కాకపోతే బయటి ప్రపంచానికి అందుబాటులో లేని మారుమూల పర్వత ప్రాంతాలను ఏరికోరి ఎంచుకుని మరీ తమ మెడిటేషన్ను కొనసాగిస్తారు. వారికి ఎండ లేదు.. వాన లేదు.. చలి లేదు.. విభూతే వారి శరీరాన్ని అన్నింటి నుంచీ కాపాడుతుంది. చిలుమ్, హుక్కా వంటివి శరీరంలో వేడిని కలిగిస్తాయి.. మనసుకు ఏకాగ్రతను కలిగిస్తాయి.. వారు శివుడిని, అగ్నిని ఆరాధిస్తారు.. మిగతా దేవుళ్లందరినీ పూజిస్తే వాళ్లు స్పందించే సరికి చాలా సమయం పడుతుందిట.. అగ్నిని ఆరాధిస్తే.. ఆయనకు ఆహుతులను అర్పిస్తే వెంటనే విభూతి రూపంలో ఫలితాన్ని అందిస్తాడట.. ఆ విభూతే నాగా సాధువులకు సర్వస్వం అవుతోంది.. విభూతి అంటే ఐశ్వర్యం. నాగా సాధువులకు ఈ విభూతే ఐశ్వర్యం.. సర్వ సంపదలూ ఈ విభూతే. పరమేశ్వరుడే స్వయంగా ధరించిన విభూతే వారికి సర్వాలంకారం. చూసే మనబోటి వాళ్లకు విచిత్రంగా అనిపించవచ్చు. కానీ, వారికి అది అవసరం లేదు. అత్యంత కఠినమైన యోగసాధన చేసి అన్నింటికీ అతీతమైన దశకు చేరుకున్న శివసైనికులు వీరు. ఉజ్జయిని.. మహా కాళేశ్వరుడిగా శివుడు పూజలందుకునే పవిత్ర పుణ్యక్షేత్రం. జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఉజ్జయిని కూడ ఒకటి. దేశంలోని మిగతా శైవ క్షేత్రాల కంటే ఉజ్జయినిలో ఒక విశిష్టమైన ఆచారం ఉంది. ప్రతి రోజూ రాత్రి పూట ఉజ్జయిని స్మశాన వాటికలో అప్పటికప్పడు తాజాగా మండిన చితిలో నుంచి భస్మరాశిని తీసుకువచ్చి మహాకాళేశ్వరుడికి అభిషేకం చేస్తారు.. భస్మరాశి విభూతిగా మారిపోతుంది... మన శరీరమే విభూతి అని చెప్పటానికి ప్రతీక ఈ అభిషేకం. నాగా సాధువులు తమ శరీరానికి రాసుకునే విభూతి కూడా ఇదే. శరీరం ఎప్పటికైనా భస్మరాశిగానే మారాల్సి ఉంటుందనటాన్ని ఎక్స్ప్రెస్ చేయటమే దీని ఉద్దేశం. సాధువుల్లో నాగాలను సృష్టించింది దత్తాత్రేయుడని చెప్తారు. ఎప్పుడు, ఎలా సృష్టించిందీ ఎవరికీ తెలియదు.. సనాతన ఆధ్యాత్మిక ధర్మాన్ని రక్షించేందుకు ఆదిశంకరాచార్య నాగా సాధువులందరినీ ఒకటి చేశారని అంటారు.
మనం ఉంటున్న ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ను వీరు కేర్ చేయరు. ఆర్మీలో ఓ రెజిమెంట్లాగా నాగా సాధువులు ఉంటారు. వీళ్లు శివుడికి సైనికుల్లా వ్యవహరిస్తారు.. ఎవరినీ దగ్గరకు రానివ్వరు.. అఘోరాల్లా అతి తీవ్రంగా లేకపోయినా, వీరి దారి వేరు.. చాలా ఆవేశపరులు.. వారి ఆగ్రహం ప్రదర్శించటానికి బెస్ట్ ఆప్షన్గా పరిగెడ్తారు. ఇంకొందరు హింసాత్మకంగా కూడా మారతారు. వారి ఆశ్రమాల్లోకి కూడా ఎవరినీ రానివ్వరు.. సామాన్యులకు అసాధారాణమైన యోగాసనాల్లో నాగా సాధువులు కనిపిస్తారు. సామాన్యంగా కనిపించే సన్యాసులకు, వీరికి అదే తేడా... అందుకే వీరిని నాగాలన్నారు. సాధువులుగా మారటం తేలికే.. సన్యాసం తీసుకోవటమే కష్టం. అన్ని సుఖాలను వదిలేసి ఆశ్రమ జీవితం గడపటం ఇంకా కష్టం. కానీ ఈ ఆశ్రమ జీవితాన్నీ వదిలేసి, శరీరాన్ని గాలికి వదిలేసి, నిద్ర, ఆహారాలను నిర్లక్ష్యానికి అప్పజెప్పేసి పూర్తిగా నాగాలుగా మారటం ఊహించినంత తేలిక కాదు. చాలా, చాలా కష్టపడ్డ తరువాత కానీ, నాగాలుగా మారటం కుదరనే కుదరదు. నాగా సాధువులు అంటే ప్రధానంగా దిగంబరులు.. ఇదెలా సాధ్యం? జీవితాంతం ఇలా ఉండటం ఎలా వీలవుతుంది? అదీ మంచు కొండల్లో.. గడ్డకట్టే చలిలో నూలుపోగైనా లేని ఒంటిని కేవలం విభూతి ఎలా రక్షిస్తుంది.. కాస్త మోతాదులో తీసుకునే మత్తు పదార్థాలు ఏమూలకు పనికి వస్తాయి? మరి వీళ్లెలా వుండగలుగుతున్నారు? నిజం.. ఇలా ఉండటం సామాన్యుడికైతే క్షణమైనా సాధ్యం కాదు.. నాగాలుగా మారేందుకు ఈ సాధువులు చాలా హార్డ్వేర్క్ చేయాల్సి ఉంటుంది. సర్వస్వం త్యాగం చేసి నాగాలుగా మారాలని అనుకున్న వారు ముందుగా ఇల్లూ వాకిలీ వదిలేసి సాధారణ సన్యాసం స్వీకరించాలి. ఆరు సంవత్సరాల పాటు కఠినమైన బ్రహ్మచర్యాన్ని అవలంబించాలి. అన్ని రుచులను వదిలేయాలి. అన్ని వాసనలకూ దూరంగా ఉండాలి. అన్ని సుఖాలను త్యాగం చేయాలి. అన్ని మోహాలను వదిలిపెట్టాలి. చివరకు వస్త్రాల్నీ వదిలేయాలి. ఇవన్నీ అనుకున్నంత ఈజీ ఏమీ కాదు.. ప్రతి విషయంపైనా ఏకాగ్రత సాధించటానికి చాలానే కష్టపడతారు. ఆ తరువాత అయిదుగురు గురువుల దగ్గర తమను తాము అన్నింటికీ అతీతంగా ఉండగలుగుతున్నట్లు నిరూపించుకోవలసి ఉంటుంది. ఆరు సంవత్సరాల బ్రహ్మచర్యంలో సాధువులు కౌపీనం అంటే లంగోటీ ధరించి వుంటారు.. ఒక్కో దానిపై మోహం తీరిపోయాక చివరగా ఆ కౌపీనాన్ని సైతం విడిచిపెడతారు. అంటే ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లోని సంసారం నుంచి తనను తాను నాగా సాధువు వేరు చేసుకున్నట్లని అర్థం. నేను అనే అహాన్ని విడిచేయడమే నాగా సాధువుల్లోని ప్రత్యేకత. బయటి శరీరం కంటే, లోపల ఆత్మ అన్నది ఒకటుందని వీరు గాఢంగా నమ్ముతారు.. ఆ ఆత్మే ప్రధానంగా జీవిస్తారు.. మిగతా శరీరంతో వారికి పని లేదు. కాబట్టి దాని గురించి పట్టించుకోరు. నాగా సాధువులు ఎక్కువగా ప్రయాణాలు చేయరు.. ఎక్కడికీ వెళ్లరు.. కేవలం కుంభమేళాలు జరిగినప్పుడే బయటకొస్తారు. ఈ లోకంలో ఈశ్వరుడికి అచ్చమైన ప్రతీకలు నాగ సాధువులు.
- కోవెల సంతోష్ కుమార్, రచయిత
ఫోన్ నంబర్: 9052116463