మా వాళ్లకే చేతకాలేదు: గంభీర్
గౌతమ్ గంభీర్
సౌతాఫ్రికాతో తొలి టెస్ట్లో తమ ఓటమికి బ్యాటర్ల వైఫల్యమే ప్రధాన కారణమని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్నాడు. పిచ్ క్యూరేటర్ను నిందించాల్సిన అవసరం లేదని, తాము కోరుకున్నట్లుగానే ఈ వికెట్ ఉందని తెలిపాడు. కానీ తమ ఆటగాళ్లే పిచ్కు తగ్గట్లుగా ఆడలేకపోయారని చెప్పాడు. పిచ్ ఎలా ఉన్నా.. 124 పరుగులు లక్ష్యం ఛేదించాల్సిందని అభిప్రాయపడ్డాడు. సౌతాఫ్రికాతో రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా కోల్కతా వేదికగా ఆదివారం ముగిసిన తొలి టెస్ట్లో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న గంభీర్.. తమ ఓటమికి గల కారణాలను వెల్లడించాడు. ఈ తరహా పిచ్లు ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని పరీక్షిస్తాయని తెలిపాడు. 'ఈ తరహా పిచ్ను మేమే అడిగాం. పిచ్ క్యూరేటర్ మాకు చాలా సహకరించారు. ఇది కష్టమైన వికెట్ అని నేను అనుకోవడం లేదు. ఇది బ్యాటర్ల మానసిక ధైర్యాన్ని పరీక్షించగల వికెట్. ఎందుకంటే ఈ వికెట్పై మంచి డిఫెన్స్తో ఆడిన వారే పరుగులు చేయగలిగారు. బ్యాటింగ్ నైపుణ్యం కంటే ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని, టెక్నిక్, మానసిక ధైర్యం, టెంపర్మెంట్ను ఈ వికెట్ పరీక్షించింది. ఈ తరహా వికెట్లు బ్యాటర్లను మరింత బలంగా మారుస్తాయి. వికెట్పై ఇంత టర్న్ లభించినా కూడా ఎక్కవ వికెట్లు పేసర్లకే దక్కాయి. మా బ్యాటర్లు టర్న్ను ఎలా ఆడాలో తెలుసుకోవాలి. మేం దీన్నే పరీక్షించాలనుకున్నాం. అందుకే ఈ వికెట్ అడిగాం. పిచ్ క్యూరేటర్ చాలా సహకరించారు. వికెట్ ఎలా ఉన్నా.. 124 పరుగులు ఛేదించదగినదే. ఈ వికెట్పై సాలిడ్ డిఫెన్స్తో ఓపికగా ఆడితే పరుగులు చేయగలరు. ఇది ఉత్సాహంగా భారీ షాట్లు ఆడే వికెట్ కాదు. కానీ ఓపికగా ఆడితే పరుగులు చేయవచ్చు. మేం కోరుకున్న పిచ్ ఇదే. కానీ మా ఆటగాళ్లే అందుకు తగ్గట్లు ఆడలేకపోయారు.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.