||ప్రతీకాత్మక చిత్రం||
ఈవార్తలు, హెల్త్ న్యూస్: కరోనా.. ఈ మహమ్మారి యావత్తు ప్రపంచాన్ని ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా దెబ్బతీసింది, దెబ్బ తీస్తూనే ఉంది. ఎన్నో జీవితాలను హరించింది. ఎంతోమందిని అనాథలను చేసింది. ఈ వైరస్ సోకిన వాళ్లలో చాలా మంది ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నారు. ఓపిక లేకపోవటం, శ్వాస సరిగా ఉండకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ సమస్యలతో పాటు సంతానంపైనా ఈ మహమ్మారి తీవ ప్రభావం చూపిస్తోందని తాజా అధ్యయనంలో శాస్త్రవేత్తలు తేల్చారు. పాట్నాలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS) వైద్య బృందం 30 మంది 19-45 ఏండ్ల వయసున్న పురుషులపై పరిశోధన చేసింది.
ఈ పరిశోధనలో పురుషుల వీర్యం నాణ్యతను కరోనా నీరుగార్చుతోందని గుర్తించింది. కరోనా వృషణాల్లోని కణజాలానికి నష్టం కలిగిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. దాంతో వీర్యం ఉత్పత్తిపై ప్రభావం పడుతోందని, ప్రత్యుత్పత్తి వ్యవస్థ సామర్థ్యం తగ్గిపోతోందని వివరించారు. శుక్రకణాల తలలు తెగిపోవడం, వాటి చిక్కదనం, నాణ్యత దెబ్బతింటున్నదని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అధ్యయనం వివరాలు క్యూరీస్ జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్స్లో ప్రచురితం అయ్యాయి.