అచ్చం సచిన్‌ సిడ్నీ ఇన్నింగ్స్‌ను తలపించేలా.. మాస్టర్‌ను అనుకరించిన విరాట్‌ కోహ్లీ

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||విరాట్, సచిన్ Photo: Twitter||

ఈవార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: కష్ట కాలంలో పరుగులు ఎలా రాబట్టాలో.. పరిస్థితులు ఎదురుతిరుగుతున్న సమయంలో క్రీజులో ఎలా నిలదొక్కుకోవాలో విరాట్‌ కోహ్లీ అహ్మాదాబాద్‌లో చాటిచెప్పాడు. ఇటీవలి కాలంలో ఆఫ్‌స్టంప్‌ ఆవల పడ్డ బంతులకు పదే పదే వికెట్‌ సమర్పించుకుంటున్న కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో కొత్తగా కనిపించాడు. ఆఫ్‌స్టంప్‌ లైన్‌లో బ్యాటింగ్‌ చేస్తూ.. దూరంగా వెళ్తున్న బంతులను వదిలేశాడు. సచిన్‌ టెండూల్కర్‌ సిడ్నీ డబుల్‌ సెంచరీ ఇన్నింగ్స్‌ తరహాలో.. కోహ్లీ అహ్మదాబాద్‌లో నింపాదిగా ఆడాడు. 

గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్లు.. ఇటుక మీద ఇటుక పేర్చి గోడ కడుతున్నట్లు.. చాల పద్దతిగా, క్రమశిక్షణగా ముందుకు సాగాడు. గత మ్యాచ్‌లతో పోల్చుకుంటే పరిణతి చెందిన ఇన్నింగ్స్‌తో ఆలరించాడు. ఏమాత్రం తొందరపడకుండా ముందుకు సాగిన కోహ్లీ.. శతకం సాధించేందుకు 241 బంతులు తీసుకున్నాడు. మామూలుగా అయితే విరాట్‌ రేంజ్‌కు ఇవి చాలా ఎక్కువ బంతులే అయినా.. పరిస్థితులకు తగ్గట్లు ఆడిన మాజీ కెప్టెన్‌ ఒక్కసారి శతకం పూరెన తర్వాత గేర్లు మార్చాడు. సెంచరీ అనంతరం విరాట్‌ తన మెడలో ఉన్న ప్రత్యేకమైన లాకెట్‌ను ముద్దాడుతూ సంబురాలు జరుపుకున్నాడు. అప్పటి వరకు బౌండ్రీలు బాదేందుకు ఎక్కువ ప్రయత్నించని విరాట్‌.. సెంచరీ తర్వాత ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. పదే పదే బంతిని గీత దాటిస్తూ స్ట్రయిక్‌రేట్‌ పెంచాడు. ఈ క్రమంలో కోహ్లీ బ్యాట్‌ నుంచి అత్యుత్తమ కవర్‌ డ్రైవ్‌లు, ఆఫ్‌ డ్రైవ్‌లు దర్శనమిచ్చాయి. పూర్తి క్రమశిక్షణతో కూడిన ఇన్నింగ్స్‌ ఆడిన కోహ్లీ.. 84 సింగిల్స్‌, 18 డబుల్స్‌ తీశాడు. రెండుసార్లు మూడేసి పరుగులు రాబట్టాడు. 

అనారోగ్యంతోనే.. 

ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో భారీ సెంచరీతో అదరగొట్టిన విరాట్‌ కోహ్లీ.. అనారోగ్యంతోనే ఆణిముత్యంలాంటి ఇన్నింగ్స్‌ ఆడాడని అతడి భార్య, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ పేర్కొంది. తాజా పోరులో 8 గంటలా 36 నిమిషాల పాటు క్రీజులో గడిపిన కోహ్లీ.. అస్వస్థతతోనే 364 బంతులు ఎదుర్కొన్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా అనుష్క వెల్లడించింది. కొద్దిలో డబుల్‌ సెంచరీ చేజార్చుకున్న కోహ్లీ.. ఔటై వెళ్తున్న సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ సహా ఆటగాళ్లంతా అతడికి షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడం అభిమానులను కట్టిపడేసింది. 

శ్రేయస్‌కు గాయం..

తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగలేకపోయిన శ్రేయస్‌ అయ్యర్‌ విషయంలో భారత జట్టు మేనేజ్‌మెంట్‌ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయ్యర్‌ గాయంపై స్పష్టత లేకుండానే అతడిని మ్యాచ్‌ ఆడించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తొలి రెండు రోజులు ఫీల్డింగ్‌ చేసిన అయ్యర్‌ ఆదివారం బ్యాటింగ్‌ సమయానికి అందుబాటులో లేకుండా పోయాడు. అతడి గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్కానింగ్‌కు పంపినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో త్వరలో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు శ్రేయస్‌ అందుబాటులో ఉండటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోహ్లీ రాణించడం సరిపోయింది కానీ, తొలి ఇన్నింగ్స్‌లో మనవాళ్లు భారీ స్కోరు చేయకపోయుంటే ఇది పెద్ద అంశంగా పరిణమించేదే!


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్