స్మృతి మందనకు జాక్‌పాట్‌.. డబ్ల్యూపీఎల్‌ వేలంలో రూ.3.40 కోట్లు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||స్మృతి మందన Photo: Twitter||

ఈవార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించనున్న ప్రీమియర్‌ లీగ్‌ తొలి వేలంలో అమ్మాయిలు అదిరిపోయే ధర దక్కించుకున్నారు. టీమ్‌ఇండియా స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మందన (ఆర్సీబీ) అత్యధికంగా 3.4 కోట్లు కొల్లగొట్టగా.. అంతర్జాతీయ స్టార్లు నటాలియా స్కీవర్‌ (ముంబై), ఆష్లే గార్డ్‌నర్‌ (గుజరాత్‌) చెరో 3.2 కోట్లు దక్కించుకున్నారు. ఫ్రాంచైజీలన్నీ ఆల్‌రౌండర్ల కోసం పోటీపడగా.. దీప్తి శర్మను రూ. 2.6 కోట్లకు యూపీ జట్టు చేజిక్కించుకుంది. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై అజేయ అర్ధశతకం బాదిన జెమీమా రోడ్రిగ్స్‌ (ఢిల్లీ)కు అనూహ్యంగా 2.2 కోట్లు దక్కగా.. భారత కెప్టెన్‌ను హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ను రూ. 1.8 కోట్లకు ముంబై ఇండియన్స్‌ కైవసం చేసుకుంది. సోమవారం ముంబై వేదికగా జరిగిన డబ్లూ్యపీఎల్‌ వేలంలో మొత్తం ఐదు ఫ్రాంచైజీలు 87 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకున్నాయి. భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మందన కోసం ఫ్రాంచైజీలన్నీ ఎగబడగా.. చివరకు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) రూ. 3.40 కోట్లు చెల్లించి మందనను దక్కించుకుంది.

 కోటి దాటిన పది మంది..

ఈ వేలంలో 10 మంది భారత ప్లేయర్లు కోటి రూపాయల మార్క్‌ దాటారు. యువ ఓపెనర్‌, అండర్‌-19 ప్రపంచకప్‌ విజేత షఫాలీ వర్మను రూ. 2 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసుకుంది. ఆల్‌రౌండర్‌ పూజ వస్త్రాకర్‌ను ముంబై రూ.1.90 కోట్లకు కొనుగోలు చేయగా.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిచా ఘోష్‌ కోసం బెంగళూరు అంతే మొత్తాన్ని వెచ్చించింది. యష్తిక భాటియా (ముంబై ఇండియన్స్‌)కు రూ. 1.5 కోట్లు దక్కగా.. పేస్‌ బౌలర్‌ రేణుక సింగ్‌ను రూ. 1.5 కోట్లకు బెంగళూరు సొంతం చేసుకుంది. అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో రాణించిన తెలంగాణ యువకెరటం గొంగడి త్రిషకు డబ్లూ్యపీఎల్‌ వేలంలో చుక్కెదురైంది. రూ.10 లక్షల ప్రాథమిక ధరతో ఉన్న త్రిషను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి కనబర్చలేదు. మరోవైపు తెలుగమ్మాయిలు అరుంధతి రెడ్డి (ఢిల్లీ క్యాపిటల్స్‌), యశశ్రీ (యూపీ వారియర్స్‌), సబ్బినేని మేఘన (గుజరాత్‌ జెయింట్స్‌), మహమ్మద్‌ షబ్నమ్‌ (గుజరాత్‌ జెయింట్స్‌), అంజలి (యూపీ వారియర్స్‌)వేలంలో అమ్ముడుపోయారు.

 

కోటీశ్వరులు వీళ్లే..

* స్మృతి మందన (ఆర్సీబీ) -  3.4  కోట్లు

* నటాలియా స్కీవర్‌ (ముంబై) - 3.2 కోట్లు

* ఆష్లే గార్డ్‌నర్‌ (గుజరాత్‌) - 3.2 కోట్లు

* దీప్తి శర్మ (యూపీ) -  2.6  కోట్లు

* జెమీమా రోడ్రిగ్స్‌ (ఢిల్లీ) - 2.2 కోట్లు

* బెత్‌ మూనీ (గుజరాత్‌) - రూ. 2 కోట్లు

* షఫాలీ వర్మ (ఢిల్లీ) -కోట్లు

* పూజ వస్త్రాకర్‌ (ముంబై) -  1.9  కోట్లు

* రిచా ఘోష్‌ (ఆర్సీబీ) - 1.9  కోట్లు

* సోఫీ ఎకెల్‌స్టోన్‌ (యూపీ) - 1.8 కోట్లు

* హర్మన్‌ప్రీత్‌ (ముంబై) -1.8  కోట్లు

* ఎలిసా పెర్రీ (ఆర్సీబీ) - 1.7 కోట్లు

* రేణుకా సింగ్‌ (ఆర్సీబీ) - 1.5 కోట్లు

* యష్తిక భాటియా (ముంబై) - 1.5  కోట్లు

* తలిహా మెక్‌గ్రాత్‌ (యూపీ) - 1.4  కోట్లు

* మెగ్‌ లానింగ్‌ (ఢిల్లీ) - 1.1 కోట్లు

* షబ్నమ్‌ ఇస్మాయిల్‌ (యూపీ) - కోటి

* అమేలియా కెర్‌ (ముంబై) - కోటి


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్