||ప్రతీకాత్మక చిత్రం||
ఈ వార్తలు, స్పోర్ట్స్ న్యూస్: క్రికెట్ అభిమానులు కనీ వినీ ఎరుగైన రికార్డు నమోదైంది. దంచికొట్టడమే పరమావధిగా భావించే టీ20 క్రికెట్లో కలలో కూడా ఊహించని ఫీట్ నమోదైంది. ఫోర్లు, సిక్సర్లకు నిలయమైన పొట్టి ఫార్మాట్లో ఓ జట్టు పట్టుమని పది పరుగులకే ఆలౌటైంది. ఇదేదో సాదాసీదా గల్లి మ్యాచ్ అనుకుంటే పోరపాటే! అంతర్జాతీయ క్రికెట్లో ఓ జట్టు 10 పరుగులకు ఆలౌటై చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆరు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం స్పెయిన్, ఐసిల్ ఆఫ్ మ్యాన్ జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ జరిగింది. దీంట్లో మొదట బ్యాటింగ్కు దిగిన ఐసిల్ ఆఫ్ మ్యాన్ జట్టు.. 8.4 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి చివరి వరకు బాదుడే ఏకైక లక్ష్యంగా బరిలోకి దిగే టీ20ల్లో ఈ గణాంకాలు అభిమానులను సైత్యం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. జట్టులో ఒక్కరు కూడా బౌండ్రీ నమోదు చేయలేకపోగా.. మొత్తం పదకొండు మంది కలిపి 10 పరుగులు మాత్రమే సాధించగలిగారు. ఆరుగురు ఆటగాళ్లు డకౌట్ అవడం గమనార్హం. 4 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు. స్పెయిన్ బౌలర్లలో కమ్రాన్, అతీఫ్ చెరో నాలుగు వికెట్లు తీశారు. అంతర్జాతీయ టీ20ల్లో ఇదే అత్యల్ప స్కోరు కాగా.. గతంలో ఈ రికార్డు బిగ్బాష్ లీగ్లో సిడ్నీ థండర్స్ (15 పరుగులు) పేరిట ఉంది. గతేడాది నమైదైన ఈ చెత్త రికార్డును ఐసిల్ ఆఫ్ మ్యాన్ జట్టు తమ పేరిట లిఖించుకుంది.
11 పరుగుల టార్గెట్తో చేజింగ్కు దిగిన స్పెయిన్ జట్టు.. రెండు బంతుల్లోనే పని పూర్తి చేసుకుంది. జోసఫ్ బురోస్ వేసిన తొలి ఓవర్ రెండు బంతుల్లోనే స్పెయిన్ టార్గెట్ ఛేదించింది. అవైస్ అహ్మద్ రెండు భారీ సిక్సర్లతో పాటు ఓ అదనపు పరుగు జతవడంతో.. స్పెయిన్ జట్టు 2 బంతుల్లోనే 13 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది. అంతర్జాతీయ క్రికెట్లో బంతుల పరంగా (118 బంతులు మిగిలుండగా) ఇదే అతిపెద్ద విజయం కాగా.. ఛేదనలో రన్రేట్ పరంగానూ ఇదే మెరుగైనది. ఇక ఐసిల్ ఆఫ్ మ్యాన్ జట్టు పురుషుల టీ20 క్రికెట్లో అత్యంత చెత్త రికార్డును తమ పేరిట రాసుకుంది.