||టీమిండియా గ్రాండ్ విక్టరీ Photo: Twitter||
ఈవార్తలు, స్పోర్ట్స్ న్యూస్: ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో టీమిండియాదే పైచేయి అయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో తొలి విజయాన్ని నమోదు చేసుకున్న హార్దిక్ సేన 1-0తో ఆధిక్యంలో నిలిచింది. బౌండ్రీలు మాత్రమే కొట్టాలని కంకణం కట్టుకుని క్రీజలు అడుగుపెట్టినట్లు.. మిషెల్ మార్ష్ విధ్వంసం సృష్టించడంతో.. 19 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 124/2తో పటిష్ట స్థితిలో నిలిచింది. అప్పటికే మార్ష్ శతకానికి చేరువ కాగా.. స్టార్ ప్లేయర్లు బ్యాటింగ్కు రావాల్సి ఉండటంతో ఆసీస్ భారీ స్కోరు చేయడం ఖాయమే అనిపించింది. అయితే ఇలాంటి దశలో మన బౌలర్లు అద్భుతం చేశారు. పట్టపగ్గాలు లేకుండా సాగుతున్న కంగారూల స్కోరుకు కళ్లెం వేస్తూ ఆసీస్ను 188 పరుగులకు ఆలౌట్ చేశారు!
వాంఖడే పిచ్పై ఇంత చిన్న స్కోరు ఛేదించడం ఒక లెక్కా అని భావించిన భారత అభిమానులకు ఐదు ఓవర్లు ముగిసేసరికే దిమ్మ తిరిగింది. బంతి అనూహ్యంగా స్వింగ్ అవుతుండటంతో పరుగులు చేయడం కాదు కదా.. బతికి బట్టకడితే అదే పదివేలు అన్న తరహాలో మనవాళ్లు బంతి బంతికి ఓ మహాగండాన్ని ఎదుర్కొన్నారు. రెండో ఓవర్లోనే ఇషాన్ ఔట్ కాగా.. కోహ్లీ, సూర్యకుమార్ వరుస బంతుల్లో పెవిలియన్ బాట పట్టారు. కాసేపటికి గిల్ కూడా వీరిని అనుసరించడంతో టీమ్ఇండియా 39/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది!!
ఇంకేముందు టీమ్ఇండియాకు పరాభవం తప్పదనుకుంటున్న తరుణంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్తో ప్రత్యర్థిపై ఎదురుదాడి ప్రారంభించగా.. టెస్టు జట్టులో చోటు కోల్పోయిన కేఎల్ రాహుల్.. వన్డేల్లో తన విలువ చాటుకున్నాడు. లక్ష్యం చిన్నదే అయినా ఆసీస్ బౌలర్లు పరీక్షిస్తుండటంతో నింపాదిగా పరుగులు చేశారు. జట్టు కుదురుకుంటున్న సమయంలో పాండ్యా ఔటైనా.. ఆల్రౌండర్ జడేజా సహకారంతో రాహుల్ మ్యాచ్ ముగించాడు!!!
మార్ష్ భయపెట్టినా..
మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 35.4 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 129/2తో పటిష్టంగా కనిపించిన ఆసీస్ ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి తక్కువ స్కోరుకే పరిమితమైంది. మిషెల్ మార్ష్ (65 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. జోష్ ఇంగ్లిస్ (26), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (22) తలా కొన్ని పరుగులు చేశారు. ఆసీస్ చివరి ఆరు వికెట్లు 19 పరుగుల తేడాలో కోల్పోవడం గమనార్హం. భారత బౌలర్లలో హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్, షమీ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం లక్ష్యఛేదనలో టీమ్ఇండియా 39.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (91 బంతుల్లో 75 నాటౌట్; 7 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా.. రవీంద్ర జడేజా (69 బంతుల్లో 45 నాటౌట్; 5 ఫోర్లు), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (25; 3 ఫోర్లు, ఒక సిక్సర్) సత్తాచాటారు. ఒక దశలో 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన జట్టును రాహుల్-పాండ్యా ద్వయం ఆదుకుంది. పాండ్యా ఔటైనా.. జడేజా సాయంతో రాహుల్ మ్యాచ్ను ముగించాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 3, స్టొయినిస్ రెండు వికెట్లు పడగొట్టారు. ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న జడేజాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది.
రాహుల్ రాకింగ్
ఛేదనలో భారత్కు శుభారంభం దక్కలేదు. రెండో ఓవర్లో యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ (3) ఔటయ్యాడు. భీకర ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్ (20)తో పాటు విరాట్ కోహ్లీ ఆదుకుంటారనుకుంటే.. రన్మెషీన్ కోహ్లీ (4) స్టార్క్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ మరుసటి బంతికే సూర్యకుమార్ (0) కూడా అదే తరహాలో ఔట్ కావడంతో 16 పరుగులకే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో గిల్ కాసేపు పోరాడినా.. అతడి షాట్లలో ఆత్మవిశ్వాసం కనిపించలేదు. క్రీజులో ఉన్నంతసేపు తడబడ్డ గిల్ స్టార్క్ బౌలింగ్లోనే వెనుదిరిగాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన స్టాండిన్ కెప్టెన్ ఎదుర్కొన్న తొలి బంతికే బౌండ్రీ బాది తన ఉద్దేశాన్ని చాటాడు. రాహుల్తో కలిసి జట్టును సురక్షిత స్థానానికి చేర్చే క్రమంలో పాండ్యా ఔట్ కాగా.. ఆఖర్లో జడేజా రాణించాడు. రాహుల్తో కలిసి మరో వికెట్ పడకుండా మ్యాచ్ను ముగించాడు. ఈ జోడీ అభేద్యమైన ఆరో వికెట్కు 108 పరుగులు జోడించడంతో భారత్ సంబురాల్లో మునిగిపోయింది. టెస్టు సిరీస్లో పేలవ ప్రదర్శనతో రెండు మ్యాచ్ల అనంతరం వైస్కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు కోల్పోయిన కేఎల్ రాహుల్.. వన్డేల్లో మాత్రం చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.