||RCB VS DC Photo: twitter||
ఈవార్తలు, స్పోర్ట్స్ న్యూస్: ఐపీఎల్ 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ఏదీ కలిసిరావడం లేదు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న వార్నర్ సేన.. లీగ్లో ఐదో ఓటమి మూటగట్టుకుంది. కింగ్ కోహ్లీ అర్ధశతకంతో రాణించడంతో ఓ మాదిరి స్కోరు చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).. కట్టుదిట్టమైన బౌలింగ్తో క్యాపిటల్స్ను కట్టిపడేసింది. ఫలితంగా శనివారం జరిగిన పోరులో బెంగళూరు 23 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (34 బంతుల్లో 50; 6 ఫోర్లు, ఒక సిక్సర్) సీజన్లో మూడో అర్ధసెంచరీ నమోదు చేసుకోగా.. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (22), మహిపాల్ లోమ్రర్ (26), గ్లెన్ మ్యాక్స్వెల్ (24), షాబాజ్ అహ్మద్ (20) తలా కొన్ని పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్, మిషెల్ మార్ష్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 151 పరుగులకే పరిమితమైంది. మనీశ్ పాండే (38 బంతుల్లో 50; 5 ఫోర్లు, ఒక సిక్సర్) పోరాడినా లాభం లేకపోయింది. బెంగళూరు బౌలర్లలో విజయ్ కుమార్ 3, సిరాజ్ రెండు వికెట్లు తీశారు. విరాట్ కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్తో కోల్కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్తో రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
ఆరంభం అదిరినా..
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన బెంగళూరుకు శుభారంభం దక్కింది. సొంత ప్రేక్షకుల మధ్య బరిలోకి దిగిన బెంగళూరు ఓపెనర్లు ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. నోర్జే వేసిన తొలి ఓవర్లో వరుస బౌండ్రీలతో ఖాతా తెరిచిన విరాట్.. గత మ్యాచ్ ఫామ్ను కొనసాగించగా.. డుప్లెసిస్ క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడాడు. తొలి వికెట్కు 42 పరుగులు జోడించిన అనంతరం అమన్ హకీమ్ ఖాన్ పట్టిన సూపర్ క్యాచ్కు డుప్లెసిస్ ఔటయ్యాడు. అయితే వనడ్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన లోమ్రర్ అండతో.. కోహ్లీ ఇన్నింగ్స్ను నడిపించాడు. ఈ క్రమంలో విరాట్ 33 బంతుల్లో ఐపీఎల్లో 47వ అర్ధశతకం నమోదు చేసుకున్నాడు. ఆ తర్వత విరాట్ ఔటైనా.. మ్యాక్స్వెల్ వచ్చీ రాగానే భారీ సిక్సర్లతో విరుచుకుపడటంతో బెంగళూరు 11 ఓవర్లలో 103/2తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ దశలో ఢిల్లీ స్పిన్నర్లు కట్టుదిట్టమైన బంతులతో బెంగళూరు మరింత భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. ఛేదనలో ఢిల్లీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. పృథ్వీ షా పేలవ రీతిలో రనౌట్ కాగా.. పవర్ప్లేలో ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఒక ఎండ్లో మనీశ్ పాండే పోరాడినా.. అతడికి సరైన సహకారం లభించలేదు.
కోహ్లీ కొత్త రికార్డు..
తాజా సీజన్లో దంచికొడుతున్న రన్ మెషీన్ విరాట్ కోహ్లీ.. అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో ఒకే వేదికపై 2500 పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా విరాట్ రికార్డుల్లోకెక్కాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడు అర్ధశతకాలు నమోదు చేసుకున్న కోహ్లీ.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో 2500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ జాబితాలో మరే ఆటగాడు కనీసం రెండు వేల పరుగులు కూడా పూర్తి చేసుకోకపోవడం గమనార్హం.