MI vs KKR | కోల్‌కతాపై ముంబై ఇండియన్స్ ఘన విజయం.. ఎట్టకేలకు ఈ ఐపీఎల్‌లో బోణీ

ఐపీఎల్ 2025లో పేలవ ప్రదర్శనతో ప్రయాణం మొదలుపెట్టిన ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. సోమవారం ముంబైలోని వాంఖడే మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని దక్కించుకుంది.

kkr vs mi

కోల్‌కతాపై ముంబై విజయం

ఈవార్తలు, స్పోర్ట్స్ న్యూస్ : ఐపీఎల్ 2025లో పేలవ ప్రదర్శనతో ప్రయాణం మొదలుపెట్టిన ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. సోమవారం ముంబైలోని వాంఖడే మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని దక్కించుకుంది. టాస్ ఓడిన KKR.. తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ముంబై బౌలర్ల ధాటికి 16.2 ఓవర్లకు 116 పరుగులే చేసి ఆలౌట్ అయ్యింది. కోల్‌కతా బ్యాటర్లలో రఘు వంశీ ఒక్కటే టాప్ స్కోరర్. అతడు 26 పరుగులు చేశాడు. రమణ్‌దీప్ సింగ్ (22), మనీశ్‌ పాండే (19), రింకు సింగ్ (17), అజింక్య రహానే (11), క్వింటన్ డికాక్ (1), సునీల్ నరైన్ (0), వెంకటేశ్‌ అయ్యర్ (3), ఆండ్రీ రస్సెల్ (5), హర్షిత్‌ రాణా (4)  తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ముంబై బౌలర్లలో అశ్వనీ కుమార్ 24 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్వనీ కుమార్ నిలిచాడు.

అనంతరం లక్ష్యఛేదనలో స్వల్ప స్కోరు కావడంతో ముంబై ఆడుతు పాడుతూ ఛేదించింది. 12.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది. రికెల్‌టన్‌ (62*; 41 బంతుల్లో 5 సిక్సులు, 4 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. చివరలో సూర్యకుమార్‌ యాదవ్‌ మెరుపు బ్యాటింగ్‌ చేశారు. 9 బంతుల్లో 27 పరుగులు చేశాడు. సిక్స్‌తో ఇన్నింగ్స్‌ను ముగించాడు. కోల్‌కతా బౌలర్లలో రస్సెల్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. ఎట్టకేలకు హార్దిక్ పాండ్యా జట్టు 2 పాయింట్లు సాధించి విజయాల ఖాతా తెరిచింది.

రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన కంటిన్యూ

ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన కంటిన్యూ అవుతోంది. తొలి రెండు మ్యాచ్‌లలో రాణించని రోహిత్.. ఈ మ్యాచ్‌లోనూ తక్కువ స్కోరుకే అవుట్ అయ్యాడు. 12 బంతులు ఆడి 13 పరుగులే చేసి రస్సెల్ బౌలింగ్‌లో హర్షిత్ రాణాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్