ipl 2025 csk vs lsg Chennai Super Kings won by 5 wickets
ధోనీ
ఎట్టకేలకు ధోనీ బ్యాటు ఝలిపించాడు.. చెన్నైని గెలిపించాడు. 5 వికెట్లు పడి కష్టాల్లో ఉన్న తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. శివమ్ దుబే కూడా శివాలెత్తడంతో లక్నోపై ఘన విజయాన్ని సీఎస్కే సొంతం చేసుకుంది. ఫలితంగా చెన్నై సూపర్ కింగ్స్ వరుస పరాజయాలకు బ్రేక్ పడింది. లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ధోనీ సేన 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత లక్నో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. కెప్టెన్ రిషబ్ పంత్ (63) అర్ధశతకంతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన చెన్నై 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టులో శివమ్ దూబె (43), రచిన్ రవీంద్ర (37), షేక్ రషీద్ (27), ధోనీ (26) రాణించారు. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్ 2, అవేశ్ ఖాన్, మార్క్రమ్, దిగ్వేశ్ తలో వికెట్ తీశారు.
తొలుత బ్యాటింగ్కు దిగిన లక్నోకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఖలీల్ బౌలింగ్లో చివరి బంతికి మార్క్రమ్ (6) ఔటయ్యాడు. నాలుగో ఓవర్లో హిట్టర్ పూరన్ (8) అన్షుల్ కంబోజ్కు వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ దశలో మిచెల్ మార్ష్ (30)తో జతకట్టిన రిషబ్ పంత్ (63) ఇన్నింగ్స్ను నిర్మించాడు. పదో ఓవర్లలో 73 పరుగుల వద్ద ఈ జోడీని జడేజా విడదీశాడు. జడ్డూ బౌలింగ్లో మిచెల్ మార్ష్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఆయుష్ బదోనీ (22), అబ్దుల్ సమద్ (20)తో కలిసి పంత్ విలువైన ఇన్నింగ్స్ నిర్మించాడు. చివరి ఐదు ఓవర్లలో ఆ జట్టు 57 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా 2, పతిరన 2, ఖలీల్ అహ్మద్, అన్షుల్ చెరో వికెట్ తీశారు. దీంతో ఎట్టకేలకు వరుస ఓటములకు చెన్నై గెలుపు సాధించి బ్రేక్ సాధించింది.