INDvsPAK | కెప్టెన్ రోహిత్ శర్మ తన మస్తిష్కంలోని వ్యూహాలను ధాటిగా విసిరాడు. అప్పటిదాకా పాక్ వైపు సాగిన మ్యాచ్.. మరో రెండు ఓవర్లలో భారత్ పోటీలో నిలిచేలా చేసింది.
పాకిస్థాన్పై టీమిండియా ఘనవిజయం
T20 World Cup 2024 | అసలే భారత్ పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్.. ప్రత్యర్థి ముందు లక్ష్యం కొంతే.. ఒక్కో బాల్కు ఒక్కో రన్ తీస్తే సరిపోతుంది.. పాకిస్థాన్ బ్యాటర్లు మెల్లిగా ఆడినా గెలుపు వాళ్లదే. పైగా, తొలి పది ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి మ్యాచ్పై పట్టు బిగించారు. టీవీల ముందు అతుక్కుపోయిన వాళ్ల ముఖాల్లో నైరాశ్యం.. చాలా మంది పాకిస్థాన్ చేతిలో ఓటమిని చూడలేక టీవీ ఆపేసివాళ్లూ ఉన్నారు. స్టేడియంలో ఉన్న టీమిండియా మద్దతుదారుల్లో ఒక్కరిలోనూ నవ్వు లేదు. ఇక చిరకాల ప్రత్యర్థి ముందు తలవంచడమే అనుకున్నారంతా. కానీ, కెప్టెన్ రోహిత్ శర్మ తన మస్తిష్కంలోని వ్యూహాలను ధాటిగా విసిరాడు. అప్పటిదాకా పాక్ వైపు సాగిన మ్యాచ్.. మరో రెండు ఓవర్లలో భారత్ పోటీలో నిలిచేలా చేసింది.
బాహుబలి సినిమాలో సైనికుల్లో ప్రభాస్ స్థైర్యం నింపినట్లు.. రోహిత్ శర్మ తన సేనను కీలక ప్లేసుల్లో మోహరించాడు. దాంతో మ్యాచ్ మొత్తం టర్న్ అయ్యింది. 14వ ఓవర్లో బ్రుమాకు బంతికి అప్పగించడంతో భారత్ వేట మొదలైంది. క్రీజులో పాతుకుపోయిన పాకిస్థాన్ ఓపెనర్ రిజ్వాన్ను బౌల్డ్ చేశాడు. నిప్పులు చెరిగే బంతులతో చెలరేగిపోయాడు. ఆ ఓవర్లో కేవలం మూడు పరుగులే ఇచ్చాడు. ఓ బంతి వేగం ఏకంగా 146.4 కిలోమీటర్ల వేగంతో విసిరాడు. ఆ తర్వాత బౌలింగ్ చేసిన అక్షర్ పటేల్ రెండే పరుగులు ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా కూడా పొదుపుగా బౌలింగ్ చేశాడు. మళ్లీ 19వ ఓవర్ వేసిన బుమ్రా మూడే పరుగులు ఇచ్చి మరో వికెట్ తీశాడు.
మొత్తం నాలుగు ఓవర్లకు 14 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీసి, తానెంత ప్రమాదకర బౌలరో మరోసారి చాటిచెప్పాడు.
కీలక సమయాల్లో బౌలింగ్ మార్చిన రోహిత్ శర్మ.. ఫలితాన్ని రాబట్టాడు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జడేజా కూడా పొదుపుతో పాక్ నడ్డి విరిచారు. కీపర్ రిషబ్ పంత్ పట్టిన క్యాచ్లు, సూర్యకుమార్ యాదవ్ పట్టిన ఫస్ట్ క్యాచ్ మ్యాచ్కే హైలైట్. మొత్తంగా టీ20 వరల్డ్ కప్లో భారత్ రెండో విజయాన్ని నమోదు చేసుకోగా, పాకిస్థాన్ రెండో ఓటమిని చవిచూసింది.