||హీలీ మథ్యూస్ Photo: Twitter||
ఈవార్తలు, స్పోర్ట్స్ న్యూస్: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రసవత్తర మ్యాచ్ల పరంపర కొనసాగుతోంది. లీగ్ ఆరంభానికి ముందే మెరుగైన ప్లేయర్ల ఎంపికతో ఆకట్టుకున్న ముంబై ఇండియన్స్ తొలి సీజన్లో రెండో విజయం నమోదు చేసుకుంది. లీగ ఆరంభ పోరులో గుజరాత్ జెయింట్స్ను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్.. సోమవారం జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 155 పరుగులకు ఆలౌటైంది. గత మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిన బెంగళూరుకు ఇది వరుసగా రెండో పరాజయం కావడం గమనార్హం. స్మృతి మందన (23), రిచా ఘోష్ (28), కనిక అహూజ (22), శ్రెయాంక పాటిల్ (23), మేగన్ షుట్ (20) తలా కొన్ని పరుగులు చేశారు. ఢిల్లీతో పోరులో ఛేజింగ్ ఎంచుకొని ఓటమి పాలైన బెంగళూరు.. ఈసారి మొదట బ్యాటింగ్ చేసినా ఫలితం మాత్రం మారలేదు. కెప్టెన్ స్మృతి మందనతో పాటు సోఫియా డివైన్ (16) ధాటిగా ఆడటంతో ఆరంభంలో స్కోరు బోర్దు పరుగులు పెట్టింది. ఈ దశలో ముంబై బౌలర్లు సత్తాచాటి నాలుగు పరుగుల తేడాలో నాలుగు వికెట్లు పడగొట్టారు. దిశ (0), పెర్రీ (13), హీతర్ నైట్ (0) విఫలమయ్యారు. మిడిలార్డర్లో రిచా, కనిక, శ్రెయాంక, షుట్ కాస్త పోరాడటంతో బెంగళూరు చివరకు పోరాడే స్కోరు చేయగలిగింది. ముంబై బౌలర్లలో హీలీ మాథ్యూస్ 3, సైకా ఇషాఖ్, అమేలియా కెర్ర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
తొలి ఓవర్ నుంచే..
అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 14.2 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 159 పరుగులు చేసింది. ఓపెనర్ హీలీ మాథ్యూస్ (38 బంతుల్లో 77 నాటౌట్; 13 ఫోర్లు, ఒక సిక్సర్), స్కీవర్ బ్రంట్ (29 బంతుల్లో 55 నాటౌట్; 9 ఫోర్లు, ఒక సిక్సర్) విజృంభించారు. గత మ్యాచ్లో ఎక్కడ ఆపారో ముంబై ప్లేయర్లు అక్కడి నుంచే బాదుడు ప్రారంభించారు. హీలీ మాథ్యూస్తో పాటు మరో ఓపెనర్ యస్తిక భాటియా (23; 4 ఫోర్లు) ఎడాపెడా బౌండ్రీలు కొట్టడంతో చేజింగ్లో ముంబైకి శుభారంభం దక్కింది. తొలి వికెట్కు 45 పరుగులు జోడించిన అనంతరం యస్తిక ఔట్ కాగా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్కీవర్ బ్రంట్.. మరింత రెచ్చిపోయింది. అటు మాథ్యూస్, ఇటు బ్రంట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరి వీరబాదుడు ముందు బెంగళూరు లక్ష్యం చిన్నబోయింది. ఎనిమిదో ఓవర్లో బ్రంట్ మూడు ఫోర్లు బాదితే.. తదుపరి ఓవర్లో మాథ్యూస్ రెండు బౌండ్రీలు దంచింది. పదకొండో ఓవర్లో వీరిద్దరి ధాటికి 15 పరుగులు రాగా.. తదుపరి ఓవర్లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. 13వ ఓవర్లో స్కీవర్ 4,6.. మాథ్యూస్ 4,4 దంచడంతో ముంబై విజయం ఖాయమైంది. అలీసా పెర్రీ వేసిన 15 ఓవర్లో బ్రంట్ రెండు ఫోర్లతో లాంచనాన్ని ముగించింది. బౌలింగ్లో మూడు వికెట్లు పడగొట్టడంతో పాటు.. బ్యాటింగ్లో అజేయ అర్ధశతకంతో ముంబైని గెలిపించిన హీలీ మాథ్యూస్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.