సౌతాఫ్రికా చేతుల్లో టెస్టు సిరీస్ ఓడిన భారత జట్టు, ప్రతీకారం తీర్చుకుంది. వన్డే సిరీస్ని 2-1 తేడాతో గెలిచిన భారత జట్టు, టీ20 సిరీస్ని 3-1 తేడాతో ముగించింది. అహ్మదాబాద్లో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్లో భారత జట్టు 30 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది.
హార్ధిక్ పాండ్యా
ఆఖరి టీ20లో ఆకాశమే హద్దు
3-1తో సిరీస్ టీమిండియా కైవసం
సౌతాఫ్రికా చేతుల్లో టెస్టు సిరీస్ ఓడిన భారత జట్టు, ప్రతీకారం తీర్చుకుంది. వన్డే సిరీస్ని 2-1 తేడాతో గెలిచిన భారత జట్టు, టీ20 సిరీస్ని 3-1 తేడాతో ముగించింది. అహ్మదాబాద్లో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్లో భారత జట్టు 30 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది. 232 పరుగుల లక్ష్యఛేదనలో 20 ఓవర్లు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు, 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేయగలిగింది.
232 పరుగుల భారీ లక్ష్యఛేదనలో రీజా హెండ్రీక్స్ 13 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే క్వింటన్ డి కాక్ 35 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. డేవాల్డ్ బ్రేవిస్ 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులతో మెరుపులు మెరిపించాడు. దీంతో 11 ఓవర్లలోనే 122 పరుగులు చేసింది సౌతాఫ్రికా. అయితే బుమ్రా, డి కాక్ని.. హార్ధిక్ పాండ్యా, బ్రేవిస్ని అవుట్ చేయడంతో సౌతాఫ్రికా వికెట్ల పతనం మొదలైంది. అయిడిన్ మార్క్రమ్ 6, డేవిడ్ మిల్లర్ 18, జార్జ్ లిండే 16, మార్కో జాన్సెన్ 14 పరుగులు చేయగా డినోవాన్ ఫెర్రారియాని వరుణ్ చక్రవర్తి గోల్డెన్ డకౌట్ చేశాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 4 వికెట్లు తీయగా బుమ్రాకి 2 వికెట్లు దక్కాయి. అర్ష్దీప్ సింగ్, హార్ధిక్ పాండ్యా చెరో వికెట్ తీశారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 231 పరుగుల భారీ స్కోరు చేసింది. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ కలిసి తొలి వికెట్కి 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 21 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్తో 34 పరుగులు చేసిన అభిషేక్ శర్మ, కార్బిన్ బాష్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ ఏడాది టీ20ల్లో 1602 పరుగులు చేసిన అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ 2016లో చేసిన టీ20 పరుగుల రికార్డుకి దగ్గరగా వచ్చాడు. 2016లో విరాట్ కోహ్లీ 29 టీ20 ఇన్నింగ్స్ల్లో 1614 పరుగులు చేయగా ఈ ఇయర్లో 40 టీ20 ఇన్నింగ్స్లు ఆడిన అభిషేక్ శర్మ 1602 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో తొలి సారిగా తుది జట్టులో ప్లేస్ దక్కించుకున్నాడు సంజూ శాంసన్. 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేసిన సంజూ శాంసన్, జార్జ్ లిండే బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి నిరాశపరిచాడు. 7 బంతుల్లో 5 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, కార్బిన్ బాష్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. హార్ధిక్ పాండ్యా, తిలక్ వర్మ కలిసి నాలుగో వికెట్కి 105 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన హార్ధిక్ పాండ్యా, యువీ తర్వాత అత్యంత వేగంగా టీ20 హాఫ్ సెంచరీ చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు. 25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 63 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, ఆఖరి ఓవర్లో అవుట్ అయ్యాడు. 42 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్తో 73 పరుగులు చేసిన తిలక్ వర్మ కూడా అదే ఓవర్లో రనౌట్ అయ్యాడు. శివమ్ దూబే 3 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్తో 10 పరుగులు చేశాడు.