తిరుమలగిరి ఏటీసీ సిగ్నల్ వద్ద సికింద్రాబాద్ నుంచి అల్వాల్ వెళ్లేవాళ్లు.. అల్వాల్ నుంచి సికింద్రాబాద్ వెళ్లేవాళ్లు.. తిరుమలగిరి వైపు వెళ్లేవాళ్లు.. బోయిన్పల్లి వైపు వెళ్లే వాహదారులు ఏటీసీ సిగ్నల్ వద్దకు రాగానే నడ్డి విరగ్గొట్టుకొని వెళ్లాల్సిందే.
తిరుమలగిరి వద్ద ఏర్పడిన భారీ గుంత
హైదరాబాద్, ఈవార్తలు : అది హైదరాబాద్ నగరంలోనే ప్రధాన కూడళ్లలో ఒకటి.. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం.. నాలుగు దిక్కులూ ట్రాఫిక్.. పది-పదిహేను మంది పోలీసులు పహారా కాస్తుంటారు.. ఓ డజను మంది ట్రాఫిక్ పోలీసులు ఛలాన్ల బిజీలో ఉంటారు.. నడిరోడ్డుపై తవ్విన సొరంగం లాంటి గుంతను మాత్రం పట్టించుకోరు.. ఈ సొరంగం ఉన్నది ఎక్కడ అంటే.. తిరుమలగిరి ఏటీసీ సిగ్నల్ వద్ద. సికింద్రాబాద్ నుంచి అల్వాల్ వెళ్లేవాళ్లు.. అల్వాల్ నుంచి సికింద్రాబాద్ వెళ్లేవాళ్లు.. తిరుమలగిరి వైపు వెళ్లేవాళ్లు.. బోయిన్పల్లి వైపు వెళ్లే వాహదారులు ఏటీసీ సిగ్నల్ వద్దకు రాగానే నడ్డి విరగ్గొట్టుకొని వెళ్లాల్సిందే. అంత లోతుగా ఉంటుందా గుంత... సారీ.. సొరంగం.
నడి రోడ్డు మధ్యలోభారీ స్థాయిలో గుంత ఏర్పడినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆ మధ్య కాంక్రీట్, సిమెంట్తో పైపూత పూయడంతో వర్షానికి అదీ కొట్టుకుపోయింది. గులకరాళ్లన్నీ చెల్లాచెదురై వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అయినా, జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. దాదాపు నెల రోజులుగా వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నా, కనికరించే నాథుడే లేడు. పోలీసులేమో ట్రాఫిక్ చలాన్లు వేయడంలో, ట్రాఫిక్ ఉల్లంఘనుల ఫొటోలు తీయడంలో బిజీగా ఉంటున్నారు తప్ప.. ఇవేమీ పట్టించుకోవడం లేదని వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఆ భారీ గుంతను పూడ్చి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.