420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులు అయ్యిందని పేర్కొంటూ బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అయితే, దానికి కౌంటర్ ఇద్దామని తలచిన కాంగ్రెస్ పార్టీ.. తన అధికారిక ట్విట్టర్లో ఒక పోల్ పెట్టింది. రాష్ట్రంలో ఏ పాలన బాగుందని అడుగుతూ ఫామ్ హౌజ్ పాలన.. ప్రజల వద్దకు పాలన.. అని రెండు ఆప్షన్లు ఇచ్చింది.
ఈవార్తలు, హైదరాబాద్ : అసలే తెలంగాణలో పాలన అంతంతగానే ఉందనేది ప్రతీ ఒక్కరు అంటున్న మాట. చివరికి సొంత పార్టీ నేతలే రేవంత్ సర్కారుపై పెదవి విరుస్తున్నారు. మొన్నటికి మొన్న నల్లగొండ జిల్లాలో ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనే బాగుందని ప్రజలు అంటున్నారని అన్నారు. నిన్న.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా.. కాంగ్రెస్ పాలనను ప్రజలు తిడుతున్నారని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో పని చేసుకుంటూ వెళ్లిపోతే ఇబ్బందేం ఉండకపోయేది. కానీ, ప్రజలను గెలికి మరీ తన్నించుకుందా? అంటే తాజా పరిణామాలు అవును అనేలా ఉన్నాయి. అసలేం జరిగిందంటే.. 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులు అయ్యిందని పేర్కొంటూ బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అయితే, దానికి కౌంటర్ ఇద్దామని తలచిన కాంగ్రెస్ పార్టీ.. తన అధికారిక ట్విట్టర్లో ఒక పోల్ పెట్టింది. రాష్ట్రంలో ఏ పాలన బాగుందని అడుగుతూ ఫామ్ హౌజ్ పాలన.. ప్రజల వద్దకు పాలన.. అని రెండు ఆప్షన్లు ఇచ్చింది.
ఫామ్ హౌజ్ పాలన అనగానే వెంటనే ప్రజలు కేసీఆర్ను తిడతారని, కేసీఆర్ సర్కారుపై ఉన్న వ్యతిరేకత కలసి వస్తుందని, ప్రజల్లో కాంగ్రెస్పై సానుకూలత ఉందని నిరూపించుకునేందుకే ఈ పోస్ట్ పెట్టినట్లు స్పష్టం అవుతోంది. అయితే, దానికి విరుద్ధంగా నెటిజన్లు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. రెండు ఆప్షన్లలో ఫామ్ హౌజ్ పాలన (కేసీఆర్) బాగుంది అని ఓటు వేయడంతో కాంగ్రెస్ నేతల దిమ్మదిరిగిపోయింది. ఏకంగా 50 వేల ఓట్లు పోలవ్వగా.. అందులో 68.1 శాతం మంది కేసీఆర్ పాలనకే మొగ్గు చూపారు. రేవంత్ పాలనకు కేవలం 31.9 శాతం మంది ఓటేశారు.
అసలే.. ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి పోల్ రిజల్ట్ రివర్స్ కావడంతో కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. త్వరలోనే స్థానిక ఎన్నికలు కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సందర్భాల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఫలితాలు రావడం అధిష్టానానికి మింగుడు పడటం లేదు. ఈ పోల్ను షేర్ చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు.. రేపటి ఎమ్మెల్సీ, స్థానిక ఎన్నికల్లోనూ ఇదే రిజల్ట్ వస్తుందని జోస్యం చెప్తున్నారు. ఏదేమైనా.. సైలెంట్గా పనిచేసుకుంటూ పోతే ఏ ఇబ్బందీ లేకపోయేది.. కానీ, కాంగ్రెస్ తన బండారాన్ని బయటపెట్టుకొని ప్రజల ముందు దోషిగా నిలిచిందనటానికి ఈ పోల్ నిదర్శనం అంటూ రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.