ఎన్నికల హామీల అమలులో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంటున్న కాంగ్రెస్ సర్కారు.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఘోర ఓటమి చెందుతుందా? ఆ పార్టీ అధికారంలోకి రాదా? అంటే షాకింగ్ విషయాలు వెల్లడైనట్లు తెలిసింది.
రేవంత్, కేసీఆర్, కిషన్ రెడ్డి
హైదరాబాద్, ఈవార్తలు : ఎన్నికల హామీల అమలులో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంటున్న కాంగ్రెస్ సర్కారు.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఘోర ఓటమి చెందుతుందా? ఆ పార్టీ అధికారంలోకి రాదా? అంటే షాకింగ్ విషయాలు వెల్లడైనట్లు తెలిసింది. థర్డ్ పార్టీ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించగా.. 26 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నట్లు తెలిసింది. కాంగ్రెస్ గెలిచిన 65 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు.. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ సీట్లలో పలు విభాగాల్లో సీఎం రేవంత్ రెడ్డి సర్వే నిర్వహించినట్లు తెలిసింది. ఆ సర్వేలో ఎమ్మెల్యేల పనితీరు, జిల్లా, స్థానిక స్థాయిలో పాలన, ప్రజల ఆశయాలపై దృష్టి.. తదితర అంశాలను బేరీజు వేసి సర్వే చేపట్టగా.. 26 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో, 14 మంది ఆరెంజ్ జోన్లో, మిగతా వారు సేఫ్ జోన్లో ఉన్నట్లు సర్వేలో తేలిందని సమాచారం.
కొంతమంది మంత్రులు తీవ్ర ఆరోపణలు ఎదుర్కుంటున్నట్లు తెలిసింది. కొందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి, విమర్శలు ఎదుర్కొంటున్నారని సర్వే సమాచారం. ముఖ్యంగా రెడ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు.. తమ నియోజకవర్గాల్లో ఉండకుండా, హైదరాబాద్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారట. వ్యాపార ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయట. ఇక.. మరి కొందరు ఎమ్మెల్యేలు అక్రమ కార్యకలాపాలు ప్రోత్సహిస్తున్నారని.. 8-10 మంది అక్రమ ఇసుక రవాణా, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మునిగి తేలుతున్నట్లు సర్వే తెలిపిందని సమాచారం. ఆరెంజ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలం అవుతున్నారట. పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు సర్వేలో వెల్లడైందట. త్వరలో దావోస్ పర్యటనకు వెళ్లనున్న సీఎం రేవంత్.. వచ్చాక రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారని తెలిసింది.
ఈ సర్వేను బట్టి తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయంగా తెలుస్తోంది. కాంగ్రెస్ గెలిచింది 65 సీట్లు. ఇతర పార్టీల్లోంచి వచ్చినవాళ్లపై ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ సొంతంగా ఉన్న 65 సీట్లలో 26 (రెడ్ జోన్)+ 14 (ఆరెంజ్ జోన్) కలుపుకుంటే.. 40 సీట్లలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు తక్కువే. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సౌకర్యం సహా అనేక పథకాలపై ప్రజల్లో పెద్దగా సానుకూలత లేదు. పైగా, రైతు రుణమాఫీ ఇంకా చాలా మందికి కాలేదన్న విమర్శలు ఉన్నాయి. పైగా.. రైతు భరోసా కింద రూ.7,500 అని హామీ ఇచ్చి.. రూ.6 వేలే ఇస్తామని చెప్పడంపైనా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్.. ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడుతోంది. అధికార కాంగ్రెస్కు నిద్ర లేకుండా చేస్తోంది. బీజేపీ పెద్దగా పోరాటం చేయడం లేదనే అపవాదు మూటగట్టుకుంది. కొందరు నేతలైతే.. పరోక్షంగా రేవంత్కు మద్దతుగా మాట్లాడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే.. బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.