రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నిలదీసేలా వ్యాఖ్యానించారు.
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నిలదీసేలా వ్యాఖ్యానించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రత్యేక హోదా అడిగినప్పుడు చంద్రబాబు రాష్ట్రానికి ఎందుకు అడగడం లేదని ఆమె ప్రశ్నించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరిస్తున్న టీడీపీ కింగ్ మేకర్గా ఉందని, అటువంటప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు అడగరని చంద్రబాబును ఆమె ప్రశ్నించారు. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ తీర్మానం చేశారని, ఏపీకి హోదాపై చంద్రబాబు నోరు ఎందుకు విప్పడం లేదన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా బీహార్ కంటే వెనుకబడి ఉన్నామన్న విషయం చంద్రబాబుకు తెలియదా..? అని షర్మిల ప్రశ్నించారు. 15 ఏళ్లు హోదా కావాలని అడిగిన రోజులు గుర్తు లేదా..? అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధిలో ఏపీ 20 ఏళ్లు వెనుకబడి ఉందని చెప్పిందని మీరే కాదా..? అని ప్రశ్నించారు.
రాష్ట్రానికి మోసం చేసిన మోదీతో హోదాపై సంతకం ఎందుకు పెట్టించలేరని ప్రశ్నించిన షర్మిల.. ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాయుడు వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గర హోదా డిమాండ్ పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రత్యేక ప్యాకేజీల కాదని, అభివృద్ధికి హోదా ఒక్కటే మార్గమని ఆమె గుర్తు చేశారు. ట్విట్టర్ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడును ప్రశ్నిస్తూ ఆమె చేసిన ట్వీట్ ప్రస్తుతం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. దీనిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎలా స్పందిస్తాయన్నది చూడాల్సి ఉంది.