ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డితో తీవ్రంగా విభేదిస్తున్న మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తల్లి వైఎస్ విజయలక్ష్మిని కలిశారు.
విజయమ్మ, జేసీ దివాకర్ రెడ్డి
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డితో తీవ్రంగా విభేదిస్తున్న మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తల్లి వైఎస్ విజయలక్ష్మిని కలిశారు. సోమవారం సాయంత్రం లోటస్పాండ్కు వెళ్లి విజయమ్మతో కలిసి కూర్చుని మాట్లాడారు. సుమారు గంటపాటు లోటస్పాండ్లో గడిపిన దివాకర్ రెడ్డి విజయలక్ష్మితో అనేక అంశాలపై చర్చించినట్టు చెబుతున్నారు. తాజా కలయిక వెనుక కారణాలు ఏమున్నాయన్న దానిపై జోరుగా చర్చ సాగుతోంది. రాజకీయాల్లో గతంతో వైఎస్తోనూ, ఆ తరువాత జగన్తోనూ తీవ్రంగా విభేదిస్తూ వస్తోంది జేసీ కుటుంబం. తాజాగా సార్వత్రిక ఎన్నికలు, ఫలితాలు అనంతరం కూడా వైసీపీ అభ్యర్ధి పెద్దారెడ్డితో తీవ్రస్థాయిలో పోరాటాన్ని చేస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అటువంటి ప్రభాకర్ రెడ్డి అకస్మాత్తుగా విజయలక్ష్మిని కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. విజయలక్ష్మిని జేసీ ప్రభాకర్రెడ్డి కలవడం వెనుక పెద్ద రాజకీయమే ఉందంటున్నారు. జగన్మోన్రెడ్డితో ఇప్పటికే ఆయన సోదరి షర్మిల తీవ్రంగా విభేదించి ముందుకు సాగుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న ఆమె జగన్పై వీలు చిక్కినప్పుడుల్లా విమర్శలు గుప్పిస్తున్నారు. వైఎస్ విజయలక్ష్మి కూడా జగన్కు దూరంగానే ఉన్నారని చెప్పాలి. ఎన్నికలు సమయంలో కూడా కుమారుడికి అండగా ఉండకుండా అమెరికాకు వెళ్లిపోయారు. అక్కడి వెళ్లి సైలెంట్గా ఉండకుండా తన కుమార్తెను ఎంపీగా గెలిపించాలంటూ కడప ప్రజలకు వీడియో రూపంలో సందేశాన్ని పంపించారు. ఇది ఒక రకంగా వైసీపీని తీవ్ర ఇరకాటంలోకి నెట్టింది. తాజా సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కూటమి బలం కొంత కారణమైతే జగన్మోహన్రెడ్డి ఇంటి పోరు కూడా ఇబ్బందులకు కారణమైందని చెబుతున్నారు.
ఈ క్రమంలోనే జగన్మోహన్రెడ్డి కూడా తల్లి విజయలక్ష్మితో అంతంతమాత్రంగానే ఉంటున్నారన్న చర్చ సాగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో జేసీ ప్రభాకర్ నేరుగా లోటస్పాండ్కు వెళ్లి కలవడం, సుమారు గంటపాటు చర్చించడం అనేక అనుమానాలకు, చర్చలకు తావిస్తోంది. విజయలక్ష్మి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకునేందుకు వెళ్లినట్టు జేసీ సన్నిహితులు చెబుతున్నా.. దీని వెనుక ఏదో బలమైన కారణం ఉందని చెబుతున్నారు. ఈ కలయిక ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కలయికపై వైసీపీ ఎలా స్పందిస్తుందన్న దానిపైనా ఆసక్తి నెలకొంది.