రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అఖండ విజయాన్ని నమోదు చేసింది. 175 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు భారీ విజయాలను నమోదు చేశారు. గడిచిన ఎన్నికల్లో 151 స్థానాలను గెలుపొందిన వైసీపీ.. ఐదేళ్లు తిరిగేసరికి బొక్కబోర్లా పడింది. కనీసం పదిహేను స్థానాలు సాధించడానికి కూడా ఆపసోపాలు పడుతోంది.
పవన్ కల్యాణ్, చంద్రబాబు
రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అఖండ విజయాన్ని నమోదు చేసింది. 175 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు భారీ విజయాలను నమోదు చేశారు. గడిచిన ఎన్నికల్లో 151 స్థానాలను గెలుపొందిన వైసీపీ.. ఐదేళ్లు తిరిగేసరికి బొక్కబోర్లా పడింది. కనీసం పదిహేను స్థానాలు సాధించడానికి కూడా ఆపసోపాలు పడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి అద్భుత విజయాన్ని నమోదు చేసి అధికారాన్ని కైవశం చేసుకుంది. ఈ విజయంలో కీలకంగా ఎవరు వ్యవహరించారన్నది ఆసక్తికరమైన అంశంగా మారింది. అయితే, ఈ విజయానికి పూర్తిగా క్రెడిట్ ఇవ్వాల్సింది మాత్రం జనసేన అధినేత పవన్ కల్యాణ్కే. ఎందుకంటే రాష్ట్రంలో అధికార వైసీపీని గద్దె దించాలంటూ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగాలని ముందు నుంచీ ఆయన చెబుతూ వచ్చారు. బీజేపీ పొత్తుకు సిద్ధంగా లేనప్పటికీ.. కేంద్ర పెద్దలతో మాట్లాడి ఆయన పొత్తును ఖరారు చేశారు. అదే ఇప్పుడు రాష్ట్రంలో కూటమి నేతలు అధికారాన్ని కైవశం చేసుకునేందుకు దోహదం చేసింది. కూటమి పార్టీలు మధ్య పొత్తు కుదిరిన తరువాత జనంలోకి వేగంగా వెళ్లడం, పార్టీలు మధ్య తలెత్తిన వివాదాలను అత్యంత వేగంగా పరిష్కరించుకోవడం, అసమత్తిని చల్లార్చడం, అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్న దానిని ప్రజల్లోకి జోరుగా తీసుకెళ్లడం వంటి అనేక అంశాలు కూటమి అధికారంలోకి రావడానికి దోహదం చేశాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కూటమిని ఏర్పాటు చేయడంలో పవన్ కల్యాణ్ విజయం సాధించడంతోపాటు చంద్రబాబు లాంటి సీనియర్ నేత అధికారంలోకి వస్తే బాగుంటుందని ప్రజలు కోరుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి రాజధాని లేకపోవడం కూడా ప్రధానమైన సమస్యగా ప్రజలు భావించారు. ఈ అంశాలే కూటమి విజయానికి దోహదం చేశాయి. చంద్రబాబు అనుభవం, పవన్ కల్యాణ్ ముందు చూపే.. కూటమి అఖండ విజయానికి కారణమయ్యాయని చెప్పవచ్చు.