||ప్రతీకత్మక చిత్రం|| ఈవార్తలు, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇంట విషాదం చోటుచేసుకున్నది. అనారోగ్య కారణాలతో మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య కన్నుమూశారు. మల్లయ్య మృతిపై పలువురు బీఆర్ఎస్ నేతలు సంతాపం తెలిపారు. మంత్రి గంగులకు ఫోన్ చేసి సానుభూతి తెలిపి, పరామర్శిస్తున్నారు. 2000 సంవత్సరంలో గంగుల కమలాకర్ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2000 – 2005 మధ్య కరీంనగర్ మున్సిపాలిటీ కౌన్సిలర్గా, కరీంనగర్ మున్సిపాలిటీ టీడీపీ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. 2006 – 2007 మధ్య కరీంనగర్ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.
అయితే, తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. బండి సంజయ్ కుమార్పై 24 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. 2018లోనూ 14 వేల ఓట్ల మెజారిటీ దక్కించుకున్నారు. టీఆర్ఎస్ రెండో సారి అధికారంలోకి వచ్చాక 2019 సెప్టెంబర్లో సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో చేరారు.