ఎప్పుడెప్పుడా అని యావత్తు తెలంగాణ ఎదురుచూస్తున్న పంచాయతీ ఎన్నికలు జనవరిలో నిర్వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. డిసెంబర్ చివరి వారంలోనే షెడ్యూల్ విడుదల చేసి.. జనవరి 7వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చే చాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది.
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్, ఈవార్తలు : ఎప్పుడెప్పుడా అని యావత్తు తెలంగాణ ఎదురుచూస్తున్న పంచాయతీ ఎన్నికలు జనవరిలో నిర్వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. డిసెంబర్ చివరి వారంలోనే షెడ్యూల్ విడుదల చేసి.. జనవరి 7వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చే చాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. పంచాయతీ ఎన్నికలను ఈ సారి మూడు దశల్లో నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. జనవరి 21వ తేదీన తొలి దశ, జనవరి 25వ తేదీన రెండో దశ, జనవరి 30వ తేదీన మూడో దశలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించనున్నారు. కౌంటింగ్ పూర్తయ్యాక ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటుందని సమాచారం. ఈ నేపథ్యంలో పంచాయతీలు, వార్డు సభ్యులకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు నడుస్తున్నట్లు తెలిసింది.
పోటీకి అర్హతలు ఇవే..
- సర్పంచ్/వార్డుకు పోటీ చేసే అభ్యర్థికి ఇద్దరి కంటే ఎక్కువమంది సంతానం ఉంటే పోటీకి అనర్హులు.
- 1995 జూన్ 1 తర్వాత మూడో సంతానం ఉండకూడదు.
- ఒక కాన్పులో ఇద్దరు లేదా ముగ్గురు పుడితే అర్హత ఉంటుంది.
- పోటీకి కనీస వయసు 21 ఏళ్లు నిండి ఉండాలి.
- పోటీ చేసే అభ్యర్థి గ్రామ పంచాయతీలో ఓటరుగా నమోదై ఉండాలి.
- వార్డు మెంబర్/సర్పంచ్కు ప్రతిపాదకుడు అదే వార్డు/గ్రామంలో ఓటరుగా ఉండాలి.
- స్థానిక సంస్థల్లోని ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు పోటీకి అనర్హులు.
- దేవాదాయ సెక్షన్ 15 ప్రకారం ఏర్పాటుచేసిన సంస్థల్లోనివారు పోటీకి అనర్హులు.
- ప్రభుత్వం ద్వారా 25 శాతానికి మించి పెట్టుబడి కలిగిన సంస్థలు/కంపెనీల మేనేజింగ్ ఏజెంట్, మేనేజర్లు, సెక్రటరీలు పోటీకి అనర్హులు.
- ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేసి ధ్రువీకరణను నామినేషన్ల పరిశీలనలోపు ఇస్తే అర్హులు.