||సీఎం కేసీఆర్||
ఈవార్తలు, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారమే రైతు రుణ మాఫీ చేయగా, మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవ వేళ రాష్ట్రంలోని పేదలకు గుడ్ న్యూస్ చెప్పారు. హైదరాబాద్లో కట్టించిన డబుల్ బెడ్రూం ఇళ్లను మంగళవారం నుంచే అందజేస్తామని ప్రకటించారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గోల్కొండ కోటలో జరిగిన వేడుకల్లో సీఎం కేసీఆర్ జెండా ఎగురవేసి, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గతంలో పేదలకు ప్రభుత్వాలు ఇచ్చిన చాలీచాలని ఇరుకుగదులు ఉండేవని, తాము అధికారంలోకి వచ్చాక పేదల ఆత్మగౌరవం కాపాడేలా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి, ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అని వెల్లడించారు.
ఇందులో భాగంగా, హైదరాబాద్లో నిర్మించి, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రభుత్వం నేటి నుంచి అర్హులైన పేదలకు అందజేస్తుందని తెలిపారు. అదేవిధంగా సొంతంగా స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని నిరుపేదలకు ప్రభుత్వం గృహలక్ష్మి అమలు చేస్తున్నదని వివరించారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు మూడు దశల్లో రూ.3 లక్షలు అందజేస్తుందని తెలిపారు. ముందుగా ప్రతి నియోజకవర్గంలో 3 వేల మందికి ఈ ప్రయోజనం చేకూర్చనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ పథకంలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించిందని పేర్కొన్నారు.