తెలంగాణ అసెంబ్లీలో పలు అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. సోమవారం ఉదయం 10గంటలకు షురూ అయిన చర్చ తెల్లవారుజామున 3గంటల వరకు కొసాగింది. ఈ సందర్బంగా బడ్జెట్ లో 19పద్దులకు సభ ఆమోదం తెలిపింది.
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సరికొత్త రికార్డు క్రియేట్ చేశాయి. సోమవారం రోజు ఈ సమావేశాలు 17గంటల పాటు నిర్విరామంగా కొనసాగి ఈ రికార్డు క్రియేట్ చేశాయి. సోమవారం ఉదయం 10గంటలకు ప్రారంభమైన సమావేశాలు మంగళవారం తెల్లవారుజామున 3.15 గంటల వరకు మొత్తం 17 గంటలపాటు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పద్దులపై పలు పార్టీల సభ్యులు చర్చలో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి, పొన్నం, దామోదర రాజనర్సింహా సమాధానం చెప్పారు.
ఈ క్రమంలో బడ్జెట్లోని 19 పద్దులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్, పరిశ్రమలు, పురపాలక, ఐటీ, ఎక్సైజ్ , హోం, ఉపాధి, రవాణా, బీసీ,విద్య, వైద్య వంటి పలు పద్ధులపై అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చ కొనసాగింది. తాము ఇచ్చిన తీర్మానాలను మంత్రుల విజ్నప్తి మేరకు బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్ రావు, బీజేపీ సభ్యుడు పాల్వాయి హరీశ్ ఉపసంహరించుకున్నారు. అనంతరం పద్దులకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలకు తిరస్కరించిన అనంతరం స్పీకర్ ప్రసాద్ కుమార్ సభను మంగళవారం ఉదయం 10గంటలకు వాయిదా వేశారు.