||లక్ష్మీపార్వతి||
నందమూరి తారకరత్న 23 రోజులపాటు చావుతో పోరాడి బెంగళూరులోని నారాయణ హృదయాలయంలో శనివారం రాత్రి మరణించారు. ఆయన మరణానికి టిడిపి అధినేత చంద్రబాబు కారణమంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. చంద్రబాబు నీచ రాజకీయాల వల్ల తమ కుటుంబంలోని ఒక మనిషిని కోల్పోవాల్సి వచ్చిందని విమర్శించారు. గత నెల 27న లోకేష్ కుప్పంలో ప్రారంభించిన పాదయాత్రలో తారకరత్న గుండెపోటుతో కుప్పకూలడం జరిగింది. దాదాపు 45 నిమిషాల పాటు మెదడుకు రక్త ప్రసరణ అందలేదు. ఆ సమయంలో రక్తం గడ్డకట్టడంతో మెదడులో ఒకవైపు వాపు ఏర్పడింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆయన పల్స్ అందటం లేదని డాక్టర్లు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నిమ్హాన్స్ తీసుకెళ్లారు. లోకేష్ పాదయాత్రకు చెడ్డ పేరు వస్తుందని ఇన్నాళ్లు తారకరత్న మరణించిన విషయాన్ని బయటకు రాకుండా చంద్రబాబు నీచ రాజకీయాలు చేశాడంటూ లక్ష్మీపార్వతి విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరు రాష్ట్రానికి అపశకునం అని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. రెండు రోజులు పాదయాత్రను వాయిదా వేసినప్పుడే తారకరత్న మరణించి ఉంటాడు వీరి నీచ రాజకీయాల వల్ల మరణ వార్తను ప్రకటించకుండా ఇన్నాళ్లు రాజకీయం చేశారంటూ లక్ష్మీపార్వతి విమర్శిస్తున్నారు. ఈ రాజకీయాల వల్ల తమ కుటుంబం పై తండ్రి, కొడుకుల ప్రభావం ఎక్కువగా పడుతుందని తమ రాజకీయాలను పక్కన పెడితేనే నందమూరి కుటుంబానికి మనశ్శాంతి దొరుకుతుందన్నారు.