తెలంగాణలో సినిమా టికెట్ల రేట్ల పెంపునకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెలిక పెట్టారు. ఆ పని చేస్తేనే టికెట్లకు పెంపునకు అవకాశం ఇస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం రే వంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో సినిమా టికెట్ల రేట్ల పెంపునకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెలిక పెట్టారు. ఆ పని చేస్తేనే టికెట్లకు పెంపునకు అవకాశం ఇస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం రే వంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇంతకీ సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. కమాండ్ కంట్రోల్ సెంటర్లో టీజీ న్యాబ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాహనాలను ప్రారంభించిన సీఎం.. అనంతరం మాట్లాడారు. తెలుగు సినీ పరిశ్రమ సైబర్ నేరాలు, డ్రగ్స్ కట్టడిపై అవగాహన కల్పించాలని కోరారు. దీనికి సంబంధించిన వీడియోలను థియేటర్లో ఖచ్ఛింగా ప్రదర్శించాలని సూచించారు. అలా ప్రదర్శించిన థియేటర్లకే భవిష్యత్లో అనుమతులు జారీ చేస్తామన్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం రోజు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ముందుకు వచ్చి ఓ వీడియోను రికార్డు చేసి పంపించినందుకు దన్యవాదాలు తెలిపారు. సినిమా ఇండస్ర్టీలోని ప్రముఖులకు నా సూచన ఏమిటంటే.. కొత్త సినిమా విడుదలైనప్పుడు టికెట్ రేట్లు పెంచుకోవడానికి జీవోలు కోసం ప్రభుత్వాలు దగ్గరకు వస్తున్నారన్నారు. కానీ, సామాజిక సమస్యలైన సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణలో సినీ పరిశ్రమ వంతు బాధ్యత వహించడం లేదని తమ ప్రభుత్వం భావిస్తోందన్నారు. తాను అధికారులకు ఒక సూచన చేస్తున్నానని, ఇకపై ఎవరైనా కొత్త సినిమా విడుదలవుతున్న సందర్భంగా టికెట్ ధరలు పెంచమంటూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే, వాళ్లు డ్రగ్స్, సైబర్ క్రైమ్ నియంత్రణకు కృషి చేస్తూ ఒక వీడియో చేయాలన్నారు. విడుదల చేసే సినిమాలోని స్టార్స్తో ఆ వీడియో రూపొందించాలని స్పష్టం చేశారు. ఇది ఖచ్ఛితమైన షరతు అని, పరిశ్రమలోని ఎంత పెద్దవాళ్లు వచ్చి రిక్వెస్ట్ చేసినా సరే అమలు చేయాలన్నారు. ఆ సినిమాలోని తారాగణంతో ఒకట్రెండు నిమిషాలు నిడివి గల వీడియో విజువల్స్ తీసుకువచ్చి ఇస్తేనే వారికి వెసులుబాటు, రాయితీలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సమాజం నుంచి ఎంతో తీసుకుంటున్నారని, సమాజానికి వాళ్లు కొంతైనా ఇవ్వాలన్నారు. సినిమా కోసం వందల కోట్లు పెట్టుబడి పెట్టి, టికెట్లు రేట్లు పెంచుకుని సంపాదించుకుంటున్నామన్న ఆలోచన మంచిదేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వ్యాపారంతోపాటు సామాజిక బాధ్యత కూడా అవసరమన్నారు. ఈ సమాజాన్ని కాపాడేందుకు సహకరించాల్సిన బాధ్యత సినీ పరిశ్రమపై ఉందన్నారు. ప్రభుత్వం నుంచి సహకారాన్ని కోరే వాళ్లు సమాజానికి సహకరించాలని, ఇదొక్కటే తమ కండిషన్గా ఆయన పేర్కొన్నారు.
60 ఏళ్ల పోరాటం, వందలాది మంది విద్యార్థుల త్యాగాలతో తెలంగాణ ఏర్పాటైందని, సమాజంలో వచ్చిన మార్పు, బలహీనతలను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుని నేరాలకు పాల్పడుతున్నారన్నారు. నేరాల కట్టడికి అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్టు వివరించారు. వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని, సైబర్ నేరాలు అతి పెద్దగా మారాయని పేర్కొన్నారు. వీటి నియంత్రణకు సైబర్ క్రైమ్ పోలీసులు కృషి చేస్తున్నారని, ప్రజలతోపాటు సినీ పరిశ్రమ నుంచి ఇందుకు సహకారం కావాలని రేవంత్ పేర్కొన్నారు.