||గద్దర్ Photo: Facebook||
ఈవార్తలు, తెలంగాణ న్యూస్: Gaddar | ప్రజా గాయకుడు గద్దర్ అలియాస్ విఠల్ రావు (74) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. అమీర్పేటలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. గుండెపోటుతో కొద్దిరోజుల కిందట హాస్పిటల్లో చేరారు. ఈ నెల 3వ తేదీన బైపాస్ సర్జరీ చేయగా, కాస్త కోలుకున్నారు. అయితే, ఊపిరితిత్తులు, యురినరీ సమస్యలతో బాధపడగా, ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆదివారం కన్నుమూశారు. గద్దర్ మరణంతో సికింద్రాబాద్లోని భూదేవి నగర్లోని ఆయన నివాసం వద్దకు బంధువులు, అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. ప్రజా గాయకుడిగా పేరొందిన ఆయన.. పీపుల్స్ వార్, మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు.
గద్దర్ 1949లో తూప్రాన్లో పుట్టారు. అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. విద్యాభ్యాసం పూర్తి చేసి 1975లో కెనరా బ్యాంకులో ఉద్యోగంలో చేరారు. ఆయనకు భార్య విమల, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు సూర్యుడు, చంద్రుడు, వెన్నెల. తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి గద్దర్ ఊపిరి పోశారు. 1987లో కారంచేడు దళితుల హత్యలపై గద్దర్ అవిశ్రాంతంగా పోరాడారు. నకిలీ ఎన్కౌంటర్లను వ్యతిరేకించారు. దీంతో 1997 ఏప్రిల్ 6న గద్దర్పై హత్యాయత్నం కూడా జరిగింది.