సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కల్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. రాష్ట్రంలో 30 వేల మందికిపైగా మహిళలు అదృశ్యమయ్యారని, వీరిని వాలంటీర్లే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేలా ట్రాప్ చేస్తున్నారనేలా పవన్ వ్యాఖ్యానించారు.
డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కల్యాణ్
సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కల్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. రాష్ట్రంలో 30 వేల మందికిపైగా మహిళలు అదృశ్యమయ్యారని, వీరిని వాలంటీర్లే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేలా ట్రాప్ చేస్తున్నారనేలా పవన్ వ్యాఖ్యానించారు. అప్పట్లో పవన్ కల్యాణ్ చేసిన ఈ ఆరోపణలు అధికార వైసీపీని తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. ఒక రకంగా చెప్పాలంటే అధికార పార్టీ పూర్తిగా ఇరకాటడంలో పడిపోయింది. వాలంటీర్లు ఈ వ్యాఖ్యలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు కూడా చేశారు. అయితే, తాజాగా కేంద్ర బండి సంజయ్ రాష్ట్రంలో మిస్ అయిన మహిళలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పార్లమెంట్లో టీడీపీ ఎంపీలు బీకే పార్థసారధి, లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన మంత్రి బండి సంజయ్ కీలక వివరాలను వెల్లడించారు. 2019-23 మధ్య ఏపీలో 44,685 మంది మహిళలు అదృశ్యం కాగా, 44,022 మందిని పోలీసులు వెతికి పట్టుకున్నట్టు వెల్లడించారు. ఈ విషయంలో కేంద్ర హోంశాఖ రాష్ట్ర పోలీస్శాఖకు సహాయపడినట్టు తెలిపారు. మానవ అక్రమ రవాణా నిలిపేందుకు, మహిళలపై వేధింపులు, అత్యాచారాల నుంచి పాడేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి విముక్తి కార్యక్రమాన్ని నిర్వహించినట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఐదేళ్లలో అదృశ్యమైన మహిళలు వివరాలు, దొరికిన విళ్ల డేటాను వెల్లడించారు. 2019లో 6,896 మంది అదృశ్యం కాగా, 6,583 మంది దొరికినట్టు తెలిపారు. 2020లో 7,576 మంది అదృశ్యం కాగా, 7,189 మంది దొరికారు. 2021లో 10,085 మంది అదృశ్యం కాగా, 9,616 మంది ఆచూకీ లభ్యమైంది. 2022లో 10,443 మంది అదృశ్యం కాగా, 10,994 మంది ఆచూకీ దొరికినట్టు వెల్లడించారు. 2023లో 9,695 మంది అదృశ్యం కాగా, 9,640 మంది ఆచూకీ లభ్యం కావడంతోపాటు వారి కుటుంబ సభ్యులు వద్దకు చేర్చినట్టు వెల్లడించారు.
పవన్పై వైసీపీ ఫైర్
గతంలో రాష్ట్రంలో మహిళలు అదృశ్యమైన వ్యవహారంపై విమర్శలు చేయడంతోపాటు 2023 జూలై 26న పవన్ కల్యాణ్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ను వైసీపీ రీ ట్వీట్ చేస్తూ కేంద్ర మంత్రి ఇచ్చిన వివరాలను ట్యాగ్ చేసింది. దిశ యాప్ వల్ల కనిపించకుండా పోయిన మహిళల ఆచూకీని గుర్తించినట్టు వెల్లడించారు. మహిళలు, యువతులు అదృశ్యం కావడానికి పరీక్షల్లో తప్పడం, ప్రేమ వ్యవహారాలు, ఇంట్లో ఘర్షణలు, మానసిక రుగ్మతలు కారణంగా పేర్కొన్న వైసీపీ.. ఈ వ్యవహారాలను రాజకీయంగా వాడుకుని తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తులు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాజకీయ విమర్శలు చేయడంతోపాటు వ్యక్తిగతంగా వాలంటీర్లను ఇబ్బందులకు గురి చేసేలా వ్యాఖ్యానించిన వ్యక్తులు దీనిపై మాట్లాడాలని డిమాండ్ చేసింది. మిస్ అయినట్టు చెబుతున్న 30 వేల మందిని తీసుకు రావాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.