తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు కనిపించడం లేదంటూ గజ్వేల్ నియోజకవర్గం అంతటా పోస్టర్లు వెలిశాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో తెలంగాణ బిజెపి నేతలు కెసిఆర్ కనిపించడం లేదంటూ పోస్టర్లు అంటించడంతోపాటు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పలు చోట్ల నిరసనలు కూడా తెలియజేశారు.
కేసీఆర్
తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు కనిపించడం లేదంటూ గజ్వేల్ నియోజకవర్గం అంతటా పోస్టర్లు వెలిశాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో తెలంగాణ బిజెపి నేతలు కెసిఆర్ కనిపించడం లేదంటూ పోస్టర్లు అంటించడంతోపాటు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పలు చోట్ల నిరసనలు కూడా తెలియజేశారు. గజ్వేల్ నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన సొంత నియోజకవర్గానికి కూడా కేసీఆర్ రావడం లేదంటూ బిజెపి నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు గజ్వేల్ పట్టణంలోని అనేక ప్రాంతాల్లో కేసీఆర్ కనబడడం లేదంటూ పోస్టర్లు ముద్రించి అంటించారు. పలుచోట్ల ఫ్లెక్సీలు పట్టుకుని నిరసనలు కూడా తెలియజేశారు. కెసిఆర్ ఎక్కడున్నా గజ్వేల్ కు రావాలంటూ బిజెపి నాయకులు నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్లలో కూడా ఫిర్యాదులు చేశారు. బిజెపి నేతలు అంటించిన పోస్టర్లలో కేసీఆర్ బొమ్మతోపాటు ఆయన గుర్తులుగా తెల్లచొక్కా, తెల్ల ప్యాంటు, తెల్ల లుంగీ వేసుకుంటారని, నెత్తిమీద టోపీ పెట్టుకుంటారని, ఆయన భయంకరమైన హిందువు అంటూ రాశారు. పైగా కేసీఆర్ 80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తి అని, ఎకరాకు కోటి రూపాయలు సంపాదించే వ్యక్తి అని పోస్టర్లలో ఎద్దేవా చేస్తూ రాసుకు వచ్చారు. గజ్వేల్ నియోజకవర్గం ప్రజల పేరుతో ఈ పోస్టర్లను ముద్రించడం గమనార్హం.
ఆయా పోస్టర్లలో చిరునామా, పూర్తి పేరు, ఇతర వివరాలను ముద్రించారు. ప్రజలను మోసం చేయడం, అధికారం కోసం ఆరాటం, కుటుంబం కోసం పోరాటం అంటూ పేర్కొన్నారు. బాధ్యత విషయానికి వస్తే గజ్వేల్ నియోజకవర్గం శాసనసభ్యుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రివర్యులుగా పేర్కొన్నారు. గుర్తులు తెల్లచొక్కా, తెల్ల ప్యాంటు లేదా తెల్ల లుంగీ, నెత్తిమీద టోపీ పెట్టుకుంటారన్నారు. అర్హతలు విషయానికొస్తే భయంకరమైన హిందువు, 80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తి, ఎకరాకు కోటి రూపాయలు సంపాదించే వ్యక్తిగా పేర్కొన్నారు.
ముఖ్యమైన సూచన పేరుతో అనేక అంశాలను ఇందులో రాసుకు వచ్చారు. పైన ఫోటోలో ఉన్న వ్యక్తి గజ్వేల్ నియోజకవర్గానికి మూడోసారి శాసనసభ్యులుగా గెలిచిన క్షణం నుంచి నేటి వరకు గజ్వేల్ నియోజకవర్గానికి రాలేదు. ఎక్కడా కనిపించడం లేదు. ముఖ్యమంత్రి పదవి పోగానే బాధలో బాత్రూంలో జారిపడి కాలు విరిగిపోయిందని తెలిసింది. సారు కారు పదహారు అని ఎక్కడకి పరారు అయ్యారో, ఎలా ఉన్నాడు తెలియడం లేదు. కావున దయచేసి ఎక్కడైనా కేసీఆర్ ఆచూకీ తెలిస్తే గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంప్రదించగలరు అంటూ గోడపత్రికల్లో రాసి ముద్రించారు.
నోట్ : కేసీఆర్ గారి ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమానం ఇవ్వబడును అని ముద్రించారు.
ఇట్లు
గజ్వేల్ నియోజకవర్గం ప్రజలు అని పోస్టర్లు ముద్రించారు. గజ్వేల్ లో పట్నంలోని అనేక ప్రాంతాల్లో ఈ పోస్టర్లను అంటించారు. ప్రస్తుతం ఈ పోస్టర్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి.