ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 175 స్థానాల్లో పోటీ.. ప్రజలు ఒప్పుకుంటారా?

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||చంద్రబాబు, జగన్, కేసీఆర్||

ఈవార్తలు, ఆంధ్రప్రదేశ్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు రాజకీయ శూన్యత ఏర్పడిందా? ఏపీని అభివృద్ధి చేయడంలో, ప్రజలను సంక్షేమ బాట పట్టించడంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ దారుణంగా విఫలమయ్యాయా? అందుకే కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయా? అంటే తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఏపీలో ప్రత్యామ్నాయంగా జనసేన ఉన్నా, ప్రజలు గత ఎన్నికల్లో అంతగా ఆదరణ చూపలేదు. ఇప్పుడు వైసీపీ సర్కారుపై ప్రజల్లో కొంత అసమ్మతి ఏర్పడుతోంది. ఇది ప్రతిపక్ష టీడీపీకి అంతగా కలిసిరావటం లేదు. జనసేన కూడా ప్రజల నాడి పట్టడంలో విఫలమైంది. ఈ తరుణంలో కేంద్రంలోని మోదీ సర్కారు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామని చెప్తోంది. దీన్ని ఏపీలోని ఏ పార్టీ కూడా వ్యతిరేకించడం లేదు, స్వాగతించడం లేదు. ఈ తరుణంలో తాము వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు వ్యతిరేకం అని కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ చెప్తోంది. అదే అజెండాగా ముందుకు వెళ్లాలని చూస్తోంది. ఈ తరుణంలో.. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ విఫలమయ్యాయని విమర్శించారు. ఆ పార్టీలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పోరాటం చేయడం లేదని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తమ పార్టీ వ్యతిరేకిస్తుందని వెల్లడించారు. ఏపీలో బీఆర్ఎస్ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

అయితే, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో ఏపీని దారుణంగా దెబ్బతీశారని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. ప్రస్తుత ఏపీ పరిస్థితికి కారణం కేసీఆరేనని గట్టిగా నమ్ముతున్నారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ పోటీకి నిలిస్తే ప్రజలు ఎంత వరకు ఆ పార్టీని ఆదరిస్తారన్నది కీలకంగా మారింది. ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై స్వరం వినిపిస్తూ ఏపీ ప్రజలకు దగ్గరయ్యేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ పరిస్థితులు ఆ పార్టీకి ఎంత అనుకూలిస్తాయో తెలియదు కానీ, ఓట్లను చీల్చడం ఖాయమని రాజకీయ పండితులు చెప్తున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోతుందని, దానివల్ల మళ్లీ అధికారం వైసీపీ సొంతం అయ్యే చాన్స్ ఉందని వివరిస్తున్నారు. జగన్ ముందస్తుకు వెళ్లే సూచనలు ఉన్నాయని పలువురు జోస్యం చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో అసెంబ్లీ పోరు రసవత్తరంగా మారుతోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్