ఈవార్తలు, పాలిటిక్స్ : జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనవరి 2వ తేదీన జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టుకు రానున్నారు. జనసేన ప్రచార వాహనం వారాహికి కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు చేయించనున్నారు. జనవరి 2న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని జనసేన నేతలు వాహన పూజకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ స్వయంగా పాల్గొంటారు. అనంతరం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలోనూ వారాహికి పూజలు చేయించనున్నారు. ఏపీలో ఎన్నికల ప్రచారం కోసం వారాహిని పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఈ వాహనంలోనే రాష్ట్రవ్యాప్తంగా పవన్ పర్యటిస్తారు.
వారాహి అంటే..
దుర్గాదేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు. అమ్మవారి పేరు మీదుగానే ఇలా తన వాహనానికి వారాహి అని పేరు పెట్టారు. కాగా, వారాహి వాహనంపై వైసీపీ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. ఆర్మీ వాహనాలకు ఉపయోగించే ఆలివ్ గ్రీన్ రంగును తన వాహనానికి ఉపయోగించారని, ఆ వాహనం రంగు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, పవన్ వాహనానికి అన్ని అనుమతులు ఉన్నాయని తెలంగాణ రోడ్డు రవాణా శాఖ తెలిపింది. రిజిస్ట్రేషన్ నంబర్ టీఎస్ 13 ఈఎక్స్ 8384ను కేటాయించింది. వారాహికి వాడిన రంగు ఆలివ్ గ్రీన్ కాదని, ఎమరాల్డ్ గ్రీన్ అని అధికారులు వివరణ ఇచ్చారు. పవన్ వాహనానికి అన్ని అనుమతులు ఉన్నాయని, నిబంధనల మేరకే రిజిస్ట్రేషన్ చేశామని స్పష్టం చేశారు.