ఏపీలో టిడిపి అకృత్యాలు, దాడులపై ఫిర్యాదు : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న హింస, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు సంబంధించి ప్రధానమంత్రి, రాష్ట్రపతి, హోంమంత్రి, జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

Vijayasai Reddy

మీడియాతో మాట్లాడుతున్న విజయసాయిరెడ్డి


రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న హింస, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు సంబంధించి ప్రధానమంత్రి, రాష్ట్రపతి, హోంమంత్రి, జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఢిల్లీలోని విజయసారెడ్డి నివాసంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల సమావేశాన్ని బుధవారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై సమావేశంలో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన విజయ సాయి రెడ్డి కీలక విషయాలను వెల్లడించారు. రాష్ట్రంలో టిడిపి చేస్తున్న అకృత్యాలను వైఎస్ఆర్సిపి కార్యకర్తల లక్ష్యంగా చేస్తున్న దాడులు గురించి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్నాయన్నారు. తమపైనే దాడులు చేస్తూ, తాము దాడులు చేస్తున్నట్లు వక్రీకరిస్తున్నారని, చంద్రబాబు పాలన ఆటవిక పరిపాలన మాదిరిగా ఉందని విమర్శించారు. వీడియో దృశ్యాలు చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని, టిడిపి నేతలు, గూండాలు చేస్తున్న దాడులు గురించి తెలుస్తుందన్నారు. దాడుల్లో గాయపడి ఫిర్యాదు చేస్తున్న సరే కేసు తీసుకోవడానికి పోలీసులు భయపడే పరిస్థితి నెలకొందని విమర్శించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే ఇలాంటి పరిస్థితి నెలకొందని, ఎన్నికల సమయంలో, ఎన్నికల తర్వాత కూడా వైసీపీ శ్రేణులు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. టిడిపి ప్రభుత్వం అంటే గుండా గిరి అన్నట్టుగా తయారైందని, ఈ తరహా దాడులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారా అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ప్రమాణ స్వీకారం తరువాత జరిగే హింసకు బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టే ఈలోగానే హింసకు తెరలేపారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో జరిగిన హింస చంద్రబాబు, లోకేష్ సృష్టించిన రక్త చరిత్రగా విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 1999, 2014, 2024 ఎన్నికల్లో బిజెపి వల్లే చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, రాష్ట్రంలో జరుగుతున్న హింసకు ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న బిజెపి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నోరు ఎత్తలేని మధ్య తరగతి, దిగువ తరగతుల జనంపై టిడిపి చేస్తున్న దాడులు హేయమైనవని అభివర్ణించారు. బీసీలను కూడా వదలడం లేదని, తమ వ్యతిరేకులను వెతికి వెతికి పట్టుకొని దాడులు చేసి వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారన్నారు. బంగారం లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ తగలబెడుతోందని విమర్శించారు. కూటమిలో బిజెపి, జనసేన కూడా భాగస్వాములేనని, రాష్ట్రంలో జరిగే హింసకు మీరు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. చివరకు టీవీ9, ఎన్టీవీ, సాక్షి సహా మరికొన్ని మీడియా సంస్థల ప్రసారాలను అడ్డుకుంటున్నారని, కేబులు ఆపరేటర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. 27 సంఘటనలను లిస్టు చేసి రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి నివేదిక రూపంలో పంపించినట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. పార్లమెంట్ లో టిడిపికి 16 మంది ఎంపీలు ఉంటే, వైఎస్సార్సీపీకి పదిహేను మంది ఉన్నారన్న విషయాన్ని గుర్తించాలని, కేంద్రంలో బిజెపికి బిల్లులు పాస్ కావాలంటే తమ మద్దతు కూడా అనివార్యమన్నారు. రాష్ట్రంలో ఓటమిపాలైనప్పటికీ పార్లమెంట్ లో తమ బలం టిడిపితో దాదాపు సమానంగా ఉందని స్పష్టం చేశారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని బిల్లుల విషయంలో తమ నిర్ణయాలు ఉంటాయన్నారు. అంశాలు వారీగా ప్రభుత్వానికి మద్దతు ఉంటుందని, అంతేతప్ప బిజెపికి కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత తమ పార్టీపై ఉంటుందన్నారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలి అన్నారు. కానీ తమ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం సరికాదన్నారు. మరో ఎంపీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గతంలో కూడా ఈ తరహా దాడులకు పాల్పడ్డారని, మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పుడు అదే పాలన ప్రారంభమైందన్నారు. టిడిపి దాడులను తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, మరికొందరు దాడుల్లో మృత్యువాత చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తుండడం దారుణమన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్