తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. తెలంగాణ ప్రజలకు కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్ 17 నుంచి పది రోజులపాటు రాష్ట్రమంతటా ప్రజాపాలన కార్యక్రమంలో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేసేందుకు ఈసారి ప్రజా పాలన కార్యక్రమం చేపడతామని వెల్లడించారు.
సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. తెలంగాణ ప్రజలకు కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్ 17 నుంచి పది రోజులపాటు రాష్ట్రమంతటా ప్రజాపాలన కార్యక్రమంలో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేసేందుకు ఈసారి ప్రజా పాలన కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. రేషన్ కార్డులు, హెల్త్ కార్డులకు లింక్ ఉండదని, వేరువేరుగా కార్డులు జారీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రజా పాలనలో ప్రతి కుటుంబం నుంచి అందుకు అవసరమైన వివరాలను సేకరిస్తామన్నారు. రాష్ట్రం అంతటా అన్ని గ్రామాలు, వార్డుల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని సీఎం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్ డిజిటల్ కార్డుల జారీకి ఎలాంటి పద్ధతి అనుసరించాలి అనే దానిపై సూచనలు చేశారు. ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ నమోదు చేసేందుకు వైద్య పరీక్షలు చేయాలని సూచించారు. గ్రామాల్లోనే హెల్త్ చెకప్ శిబిరాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ఉన్న లేబోరేటరీల సాయం తీసుకోవాలా..? అనే దానిపై వెంటనే పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులు ఆదేశించారు.
హెల్త్ డిజిటల్ కార్డులకు సంబంధించి ఫ్రాన్స్ లో ఉత్తమమైన విధానం అనుసరిస్తున్నారని, ఇటీవల విదేశీ పర్యటనలో తనను కలిసిన ప్రతినిధులు చెప్పినట్లు సీఎం పేర్కొన్నారు. అక్కడ అనుసరించే విధానాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఆరోగ్య శ్రీ వైద్య సేవలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించేందుకు ఇక రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే హెల్త్ కార్డు ప్రామాణికంగా ఉంటుందని సీఎం వెల్లడించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. డెంగ్యూ, చికున్ గున్యా, వైరల్ జ్వరాలతో వివిధ ఆస్పత్రుల్లో పెరుగుతున్న కేసులు నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి.. వ్యాధులు రాకముందే తగిన నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్, స్ప్రే మమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు. జిహెచ్ఎంసి పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్ క్రమం తప్పకుండా జరిగేలా చూడాలని సూచించారు. ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయాలని సీఎం ఆదేశించారు. ప నిచేయని ఉద్యోగులను, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చేపట్టే చర్యలు పట్ల ఉదాసీనంగా వ్యవహరించే వారిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. జిహెచ్ఎంసి పరిధిలోని అధికారులు, వైద్యారోగ్య శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ సమన్వయంతో పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అవసరమైతే పోలీసు విభాగం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సహకారంతో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు సీజనల్ వ్యాధులపై వెంటనే ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని స్పష్టం చేశారు.