రాజకీయాల్లో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ శైలి సెపరేటు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వాటిని దీటుగా ఎదుర్కొని రాజకీయంగా ఎంతో ఎత్తుకు ఎదిగారు. అదే సమయంలో తన దూకుడైన తీరుతో ప్రజల్లో, యూత్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
మాట్లాడుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్, ఈవార్తలు : రాజకీయాల్లో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ శైలి సెపరేటు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వాటిని దీటుగా ఎదుర్కొని రాజకీయంగా ఎంతో ఎత్తుకు ఎదిగారు. అదే సమయంలో తన దూకుడైన తీరుతో ప్రజల్లో, యూత్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాంటి బండి సంజయ్.. ఒక భారీ శపథాన్ని చేశారు. గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇప్పటినుంచి కరీంనగర్లో రాజకీయ విమర్శలు చేయనని ప్రతిజ్ఞ చేశారు. రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి.. పోతుంటాయని, కానీ చేసిన అభివృద్ధి, మంచి పనులే శాశ్వతంగా నిలిచిపోతాయని అన్నారు. జెండా, ఎజెండాలను పక్కనపెట్టి అభివృద్ధి ధ్యేయంగా అన్ని పార్టీల నాయకులతో కలిసి పనిచేస్తానని వెల్లడించారు.
కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్రావుతో కలిసి 14 వ డివిజన్లో పలు పనులు, పద్మానగర్లోని 16వ డివిజన్లో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్ను బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరంగల్కు దీటుగా కరీంనగర్ను అభివృద్ధి చేస్తామన్నారు. వాస్తవంగా చెప్పాలంటే వరంగల్ కంటే వేగంగా కరీంనగర్ అభివృద్ధి చెందుతోందని చెప్పారు. అనేక కారణాల వల్ల స్మార్ట్ సిటీ నిధులు పూర్తిగా వినియోగంలోకి రాలేదని, ఇప్పుడిప్పుడే అవన్నీ ఖర్చు చేసి అభివృద్ధి చేసుకుంటున్నామని వివరించారు. కేంద్రం నుండి నిధులు తీసుకొస్తానని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను కొట్లాడి సాధించుకుందామని పేర్కొన్నారు.