ఎన్నికల వేళ మళ్లీ తెరపైకి తెలంగాణ సెంటిమెంట్.. ప్రజలారా గమనిస్తున్నారా?

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

(Pic: ఏపీ, తెలంగాణ మ్యాప్)

ఈవార్తలు, ఈముచ్చట: తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయి 8 ఏళ్లు గడిచిపోయింది. ఎవరికి వారే అన్నట్టు బతుకుతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం, ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏలుతున్నాయి. కానీ, మళ్లీ తెరపైకి తెలంగాణ సెంటిమెంట్ వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణను కలిపితే బాగుంటుందని ఏపీ అధికార పార్టీకి చెందిన సజ్జల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంకేం.. తెలంగాణపై వ్యాఖ్యానించొద్దని టీఆర్ఎస్ నేతలు స్పీచ్‌లు అందుకున్నారు. ఇక, ఇలాంటి వ్యాఖ్యలు వస్తూనే ఉంటాయి.. దానికి టీఆర్ఎస్ నేతలు ఇలా కౌంటర్ ఇస్తూనే ఉంటారు. అయితే, ఇక్కడే ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సరిగ్గా నాలుగేళ్ల కిందట.. 2018 డిసెంబర్‌లో తెలంగాణకు ముందస్తు ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు తెలంగాణలో టీడీపీని నిలిపారు. ఏకంగా కూకట్‌పల్లి నుంచి నందమూరి ఆడబిడ్డను బరిలో నిలిపి ప్రచారం చేశారు.

అప్పటిదాకా, కాస్తో కూస్తో కేసీఆర్‌పై ఆగ్రహంతో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు. కారణం.. చంద్రబాబు మళ్లీ ఇక్కడికి వస్తున్నాడు, గెలిస్తే తెలంగాణను ఏపీలో కలిపేస్తాడని ప్రచారం కొందరు చేశారు. అదీ నిజమే అనుకున్న ప్రజలు.. టీఆర్ఎస్‌కు బ్రహ్మరథం పట్టారు. అలా.. తెలంగాణ సెంటిమెంట్‌ 2018 ఎన్నికల్లో బాగానే పనిచేసింది. ఇప్పుడు తెలంగాణలో మళ్లీ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. ఈ సమయంలో సజ్జల వ్యాఖ్యలు అనుమానాస్పదంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. దానికీ ఓ కారణం ఉంది.

ఇన్నేళ్లు ఏమీ మాట్లాడని సజ్జల.. అసందర్భంగా తెలంగాణ సెంటిమెంట్‌ను టచ్ చేసేలా వ్యాఖ్యలు చేయటం టీఆర్‌ఎస్ కోసమేనని పలువురు మాట్లాడుకుంటున్నారు. సజ్జల అలా మాట్లాడగానే, టీఆర్ఎస్ నేతలు ఇలా ఖండనలు మొదలు పెట్టారు. నిజమే.. యాక్చువల్‌గా తెలంగాణకు ద్రోహం చేయాలని చూస్తే ఏ ఒక్క తెలంగాణ బిడ్డా ఊరుకోడు. అలాంటిది టీఆర్ఎస్ నేతలే చడీచప్పుడు లేకుండా ఉంటే మొదటికే మోసం వస్తుందని నాయకులకు తెలుసు. అయితే, టీఆర్ఎస్, వైసీపీ మంచి మిత్ర పార్టీలని ప్రతీ ఒక్కరికి తెలుసు. అందుకే, సజ్జల ఆ కామెంట్‌తో టీఆర్ఎస్‌కు కలిసొచ్చేలా చేశారని రచ్చబండ కాడ పెద్ద టాక్. అంటే.. ప్రజలకూ ఓ అవగాహన ఉన్నదన్నట్లే.

ఇక.. తెలంగాణ సెంటిమెంట్‌ను ఎంత వీలైతే అంత వాడుకొందామని కాంగ్రెస్, బీజేపీ ట్రై చేస్తూనే ఉన్నాయి. ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని రేవంత్ రెడ్డి, ఉద్యమంలో ఏనాడూ యాక్టివ్‌గా పాల్గొనని బీజేపీ కూడా తెలంగాణ గురించి మాట్లాడటం ఏమిటి? అని సగటు తెలుగు వ్యక్తి మెదడులో పెద్ద ప్రశ్న. ఇక్కడ ఒకటే ప్రజలారా.. తెలంగాణను ఆంధ్రలో కలపడానికి తెలంగాణ వాళ్లు ఒప్పుకోరు. అంటే.. అది కాని పనే. తెలంగాణలో, ఏపీలో రాజకీయాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందేనని రాజకీయ పండితులు ఘంటాపథంగా చెప్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్