పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుంది. పుచ్చకాయ శరీరానికి ఎక్కువగా నీటిని అందిస్తుంది. ఇందులోని లైకోపిన్, యాంటీయాక్సిడెంట్ ఎలిమెంట్స్, విటమిన్-ఏ, విటమిన్-సీ, పొటాషియం అధికంగా ఉంటాయి.
ప్రతీకాత్మక చిత్రం
వేసవికాలం మొదలైంది. ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 దాటిందంటే చాలు సూర్యుడు మండెక్కిపోతున్నాడు. ఇంట్లో నుండి బయటకు వెళ్లడం అంటేనే జనాలు భయపడుతున్నారు. అత్యంత ముఖ్యమైనపనులు ఉంటేనే బయటకు వెళ్లడం మంచిదని ఆరోగ్యశాఖ కూడా సూచిస్తోంది. అందులోనూ 6 సంవత్సరాలలోపు గల పిల్లలను, వృద్ధులను బయటకు తీసుకురావకపోవడమే మంచిదని చెప్తున్నారు. వేసవి ప్రభావం చిన్నపిలల్లపై, వృద్ధులపై ఎక్కువగా ఉంటుంది. వేసవిలో శరీరంలో నీటి శాతం త్వరగా తగ్గిపోతుంది. కాబట్టి ఎక్కువగా నీటిని తీసుకోవడం మంచిది. నీరు చెమటరూపంలో బయటకు వెళుతుంది. ఇలాంటప్పుడు నీటితో పాటు నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లను తీసుకోవడం మేలు. అందులోనూ ముఖ్యంగా పుచ్చకాయ. పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుంది. పుచ్చకాయ శరీరానికి ఎక్కువగా నీటిని అందిస్తుంది. ఇందులోని లైకోపిన్, యాంటీయాక్సిడెంట్ ఎలిమెంట్స్, విటమిన్-ఏ, విటమిన్-సీ, పొటాషియం అధికంగా ఉంటాయి. పుచ్చకాయలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల పొట్ట ఎక్కువ సమయం నిండుగా ఉంటుంది. వేసవిలో పుచ్చకాయను తినడం వల్ల ఎండ వేడి నుండి ఉపశమనం లభిస్తుంది. తాజా పుచ్చకాయలో సిట్రోలిన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. డైట్ చేసే వారికి కుడా చాలా మంచి పండు. శరీరంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రిస్తుంది.
అయితే, చాలా మంది పుచ్చకాయను మార్కెట్ నుంచి తెచ్చి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా అయ్యాక తింటారు. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి తినడం వల్ల పుచ్చకాయలో ఉన్న పోషక విలువలు తగ్గిపోతాయి. పండ్లను ఫ్రిడ్జ్లో పెట్టి తినడం వంటి అలవాటు ఉంటే వీలైనంత వరకు మానేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచడమే మంచిదని సూచిస్తున్నారు. కట్ చేసిన పుచ్చకాయను ఫ్రిడ్జ్లో పెట్టినా ఫుడ్ పాయిజన్ అయ్యే సూచనలు ఉన్నాయని వెల్లడిస్తున్నారు. కాబట్టి ఇక నుంచైనా పుచ్చకాయను ఫ్రిడ్జ్లో పెట్టకపోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.