ఈ నెల ఆరో తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే అనూహ్యంగా ఈ ప్రకటన వాయిదా పడింది. దీనికి ఎస్సీ వర్గీకరణ కారణంగా చెబుతున్నారు. ఎస్సీ వర్గీకరణకు సుప్రీం కోర్టు అనుకూలంగా తీర్పు వెలువరించిన నేపథ్యంలో డీఎస్సీ నుంచి దానిని అమలు చేయాలని విజ్ఞప్తులు రావడంతో నోటిఫికేషన్ ను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఎలా చేయాలన్న దానిపై ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ ను నియమించింది.
డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పారు. అందుకు అనుగుణంగానే సీఎం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే డీఎస్సీ విడుదలకు సంబంధించిన ఫైల్ పై సంతకం చేశారు. దీంతో గడిచిన ఏడేళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరో ఆరు నెలలు నుంచి ఏడాది కాలంలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ ప్రక్రియ ముగుస్తుందని అంతా భావించారు. అయితే ప్రభుత్వం ఏర్పాటయి ఆరు నెలలకు కావస్తున్న ఇప్పటి వరకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాలేదు. ఈ నెల తొలివారం వరకు టెట్ నిర్వహించిన ప్రభుత్వం.. ఈ నెల ఆరో తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే అనూహ్యంగా ఈ ప్రకటన వాయిదా పడింది. దీనికి ఎస్సీ వర్గీకరణ కారణంగా చెబుతున్నారు. ఎస్సీ వర్గీకరణకు సుప్రీం కోర్టు అనుకూలంగా తీర్పు వెలువరించిన నేపథ్యంలో డీఎస్సీ నుంచి దానిని అమలు చేయాలని విజ్ఞప్తులు రావడంతో నోటిఫికేషన్ ను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఎలా చేయాలన్న దానిపై ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ ను నియమించింది. రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో నివేదిక వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. రెండు, మూడు నెలల్లో నోటిఫికేషన్ జారీ చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంటే ఇప్పట్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల లేనట్టే. తాజా ప్రభుత్వం నిర్ణయం పట్ల నిరుద్యోగులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. గడిచిన ఏడేళ్లుగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నామని.. కూటమి ప్రభుత్వం కూడా ఊరించి ఉసూరుమనిపించిందని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నోటిఫికేషన్ జారీ తర్వాత నియామక ప్రక్రియ వేగంగా పూర్తి చేస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే విద్యా సంవత్సరంలో బడులు తెరుచుకునే సమయానికి కొత్త టీచర్లు అందుబాటులో ఉండేలా గణాలకు రచిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, అందుకు అనుగుణంగా ప్రక్రియ ప్రారంభం కావడం లేదన్న అభిప్రాయం నిరుద్యోగుల్లో వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉంటే డీఎస్సీ నోటిఫికేషన్ పై న్యాయవివాదాలు రాకుండా ఉండేందుకు అనుగుణంగా విద్యాశాఖ దృష్టి సారిస్తోంది. ఈ నోటిఫికేషన్కు అటువంటి పరిస్థితి ఎదురు కాకూడదనే ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ అధికారులు న్యాయవివాదాలు అంశాలను సుదీర్ఘంగా సమీక్షించినట్లు తెలుస్తోంది. వివాదం తలెత్తకుండా నోటిఫికేషన్ ను సాఫీగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు వర్గీకరణ కారణంగా మరికొంత గడువు దొరకడంతో నోటిఫికేషన్ను మరింత పకడ్బందీగా, లోపాలు కూడా లేకుండా చేయాలని చూస్తున్నారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ కూడా దీనిని సీరియస్ గా తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. సీఎం చంద్రబాబు తొలి సంతకం పెట్టిన హామీ కావడంతో న్యాయవివాదాలను అధిగమించేలా నోటిఫికేషన్ ఉంటుందని అధికారులు వెల్లడిస్తున్నాయి. ఏది ఏమైనా తాజా జాప్యం వల్ల డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు మాత్రం అసహనాన్ని, ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎన్నాళ్లపాటు తమకి నిరీక్షణ అర్థం కావడం లేదంటూ వాపోతున్నారు.