గోదావరి జిల్లాలను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కానూరు అగ్రహారం, పశ్చిమగోదావరి జిల్లా తణుకు రూరల్ మండలం, వేల్పూరులోని కోళ్ల ఫారాల్లో ఉన్నట్టుండి వేల కొద్ది కోళ్లు మరణించడం ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తుంది. మరణించిన కోళ్ల శాంపిల్స్ ను పరీక్షించగా బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో పౌల్ట్రీ పరిశ్రమ ఒక్కసారిగా కుదేలైంది. గోదావరి జిల్లాలైన తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలో కోళ్ల పరిశ్రమ బాగా విస్తరించింది. ఈ జిల్లాలో 350 వరకు పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయి.
కోళ్ల ఫారంలో మృతి చెందిన కోళ్లు
గోదావరి జిల్లాలను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కానూరు అగ్రహారం, పశ్చిమగోదావరి జిల్లా తణుకు రూరల్ మండలం, వేల్పూరులోని కోళ్ల ఫారాల్లో ఉన్నట్టుండి వేల కొద్ది కోళ్లు మరణించడం ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తుంది. మరణించిన కోళ్ల శాంపిల్స్ ను పరీక్షించగా బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో పౌల్ట్రీ పరిశ్రమ ఒక్కసారిగా కుదేలైంది. గోదావరి జిల్లాలైన తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలో కోళ్ల పరిశ్రమ బాగా విస్తరించింది. ఈ జిల్లాలో 350 వరకు పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయి. వీటిలో మూడు కోట్ల వరకు కోళ్లను పెంచుతున్నారు. ఆయా పౌల్ట్రీ ఫారాల నుంచి ప్రతిరోజు 2.40 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుంటాయి. ఇవన్నీ స్థానిక అవసరాలకే కాకుండా ఒరిస్సా, బీహార్, పశ్చిమబెంగాల్, అస్సాం తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. గోదావరి జిల్లాల్లో రోజుకు కనీసం 30 వేల కోళ్లను మాంసం కోసం వినియోగిస్తారు. పరిశుభ్రత లేకపోవడం కానీ, వేరే ప్రాంతాల నుంచి వచ్చిన కోళ్ల ద్వారా గాని కానూరు అగ్రహారంలో బర్డ్ ఫ్లూ వ్యాపించి ఉండవచ్చని చెబుతున్నారు.
దీని కారణంగా ప్రస్తుతం తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలో కోళ్లు ఎక్కువగా చనిపోతున్నాయి. ఇది మరింత వ్యాప్తి చెందకుండా తక్షణ చర్యలు తీసుకోకపోతే పౌల్ట్రీ పరిశ్రమ మరింత కుదేలయ్యే ప్రమాదం ఉంది. కానూరు అగ్రహారంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు మండలాల పరిధిలోని 34 గ్రామాల్లో 64 వైద్య బృందాలు ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకు రూరల్ మండలం వేల్పూరు లోని కృష్ణనందం పౌల్ట్రీ నుంచి కిలోమీటర్ దూరం వరకు ఇన్ఫెక్షన్ జోన్ గా, పది కిలోమీటర్ల పరిధిని అలర్ట్ జోన్ గా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ జోన్ లో చికెన్, కోడిగుడ్ల అమ్మకాలను నిలిపివేయాలని ఆదేశించారు. ఏపీలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతూ ఉండడంతో సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. ఏపీలో నెలకొన్న పరిస్థితుల్లో నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం అప్రమత్తమయింది. ఏపీ నుంచి కోళ్లను తమ రాష్ట్రంలోకి రానీయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా 24 చెక్పోస్టులు పెట్టిన అధికారులు ఏపీ నుంచి కోళ్ల లోడుకోవచ్చే వాహనాలను వెనక్కి పంపుతున్నారు. కాగా బర్డ్ ఫ్లూ భయంతో తెలంగాణలో చికెన్, గుడ్డు అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి.