ఏపీలో రాజకీయం సరికొత్త మలుపు తీసుకుంది. కొద్దిరోజులు కిందటి వరకు విజయవాడ వరద కేంద్రంగా సాగిన రాజకీయం.. తాజాగా తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదం వైపు మలుపు తీసుకున్నాయి. రెండు రోజులు కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లడ్డూ ప్రసాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి ప్రసాద నాణ్యతను గత వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని, భక్తులు పవిత్రంగా భావించే ప్రసాదంలో పశువుల కొవ్వును కలిపారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
శ్రీవారి లడ్డూ, చంద్రబాబు, జగన్
ఏపీలో రాజకీయం సరికొత్త మలుపు తీసుకుంది. కొద్దిరోజులు కిందటి వరకు విజయవాడ వరద కేంద్రంగా సాగిన రాజకీయం.. తాజాగా తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదం వైపు మలుపు తీసుకున్నాయి. రెండు రోజులు కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లడ్డూ ప్రసాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి ప్రసాద నాణ్యతను గత వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని, భక్తులు పవిత్రంగా భావించే ప్రసాదంలో పశువుల కొవ్వును కలిపారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం శ్రీవారి లడ్డూ కేంద్రంగా అధికార, ప్రతిపక్షాలు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరుగుతోంది. తాజాగా చంద్రబాబు దీనిపై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశాడని మరోసారి విమర్శించారు. కల్తీ నెయ్యితో వేవుడికి నైవేధ్యం పెట్టారని, శ్రీవారి ప్రసాదంలో ఇష్టానుసారం పదార్థాలు వాడారని ఆరోపించారు. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారన్న చంద్రబాబు.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దర్శనాలు, భోజనాలు తిరుపతిలో సరిగ్గా లేవని పేర్కొన్నారు. క్షమించరాని నేరం చేశారని, వదలిపెట్టేది లేదని హెచ్చరించారు. తిరుమలతో సంపూర్ణ ప్రక్షాళన మొదలుపెట్టామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏమీ తెలియని ఏ1, ఏ2 తన పాలన గురించి మాట్లాడుతున్నారని, పాలన గురించి వీళ్లని అడిగి తాను తెలుసుకోవాలా..? అని ప్రశ్నించారు. టెండర్ పిలిచానని జగన్ చెబుతున్నాడని, రూ.320కే కిలో నెయ్యి వస్తుందంటే ప్రభుత్వం ఆలోచించవద్దా..? అని ప్రశ్నించారు.
డైవర్షన్ పాలిటిక్స్లో చంద్రబాబు దిట్ట అన్న జగన్
డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే పనిగా చంద్రబాబు పెట్టుకున్నారని వైసీపీ అధినేత జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూ ప్రసాదంపై రేగిన వివాదంపై జగన్ స్పందించారు. బాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తిరుమలలో కల్తీ నెయ్యి అంటూ రాజకీయాలు కోసం దేవుడిని కూడా వాడుకునే నైజం బాబుది అని విమర్శించారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు కట్టుకథలు చెబుతున్నారన్న జగన్.. నెయ్యికి బదులు జంతు కొవ్వు వాడారని దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల మంది భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దశాబ్ధాల తరబడి ఒకే విధానంలో లడ్డూ తయారీ సామాగ్రి కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందన్న జగన్.. ప్రతి ట్యాంకర్ ఎన్ఏబీఎల్ సర్టిఫికెట్ తీసుకురావాలని, ఆ తరువాతే టీటీడీ మూడు శాంపిల్స్ను తీసుకుని పరీక్షిస్తుందన్నారు. ఈ టెస్ట్లు పాసైతేనే ఆ సామాగ్రిని టీటీడీ అనుమతిస్తుందని పేర్కొన్నారు. ఈ విధానం దశాబ్ధాల నుంచి కొనసాగుతోందన్నారు. 2014-19 మధ్య కాలంలో 14 నుంచి 15 సార్లు మాత్రమే రిజక్ట్ చేశారని, తమ ప్రభుత్వ హయాంలో 18 సార్లు రిజక్ట్ చేసినట్టు వెల్లడించారు. తిరుమల శ్రీవారి ప్రతిష్టను చంద్రబాబు దిగజారుస్తున్నాడని, తప్పు జరగకపోయినా టీటీడీ పరువును బజారుకు ఈడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీజేఐ, ప్రధానికి లేఖ రాస్తామని స్పష్టం చేశారు.