దేశంలో జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లేందుకు నిర్ణయించింది. జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. లోక్ సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిపే రాజ్యాంగ సవరణ బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ప్రతీకాత్మక చిత్రం
దేశంలో జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లేందుకు నిర్ణయించింది. జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. లోక్ సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిపే రాజ్యాంగ సవరణ బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గురువారం కేంద్ర క్యాబినెట్లో ఈ బిల్లును ఆమోదించవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర క్యాబినెట్ సమావేశం సాధారణంగా బుధవారం జరగాల్సి ఉంది. అయితే ఈసారి గురువారానికి వాయిదా వేశారు. బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత లోక్ సభ, రాజ్యసభలకు చెందిన సంయుక్త కమిటీ (జేపీసి) కి నివేదిస్తారని, వచ్చే బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ మధ్యకాలంలో జేపీసీ వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లను సంప్రదిస్తుందని చెబుతున్నారు. బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రాలకు పంపిస్తారు.
సగానికిపైగా అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత అది చట్ట రూపం పొందుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. జమిలి ఎన్నికలపై గడిచిన ఏడాది సెప్టెంబర్ లో ఏర్పాటైన రామ్ నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులను కేంద్ర క్యాబినెట్ ఇప్పటికే ఆమోదించింది. ఈ కమిటీకి 47 రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను తెలిపాయి. 32 పార్టీలు జమిలి ఎన్నికలను సమర్థించాయి. బిజెపి, బిజెడి, జేడీయు, శివసేన వీటిలో ఉన్నాయి. వనరులు ఆధా కావడం, సామాజిక సామరస్యాన్ని కాపాడటం, ఏకకాలంలో దేశంలో అభివృద్ధి జరగటం జమిలి ఎన్నికలు వల్ల సాధ్యపడతాయని భావిస్తున్నారు. లోక్ సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు రాజ్యాంగంలోని 83, 172 అధికరణలను సవరించాలని కమిటీ సూచించింది. దీనివల్ల రాష్ట్రపతి, గవర్నర్ రద్దు చేస్తే తప్ప లోక్ సభ, అసెంబ్లీలు పదవీకాలం ఐదేళ్లు స్థిరంగా ఉంటుందని కమిటీ భావించింది. బిజెపి ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోలో జమిలి ఎన్నికలను ప్రవేశపెడతామని ప్రజలకు హామీ ఇచ్చింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇదే అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఎంఐఎంతోపాటు అనేక పార్టీలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయి. విషయాన్ని జేపీసీకి నివేదించి ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. జేపీసీ ఏర్పాటు అయితే దాని ద్వారా అన్ని పార్టీల ప్రతినిధులు, మేధావులు, సామాన్యుల అభిప్రాయాలను కూడా సేకరించేందుకు అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం ఉన్న ఎన్నికల విధానాన్ని మార్చడం భారీ సవాళ్లతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఏకాభిప్రాయ సాధన తప్పనిసరి అని ప్రభుత్వం భావిస్తోంది. జమిలి ఎన్నికల బిల్లు ఆమోదం పొందితే ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయన్న విషయంపైనా చర్చ జరుగుతోంది. జనగణన, నియోజకవర్గాల పునరుద్ధరణ జరగాల్సి ఉంది. కాబట్టి, 2029 వరకు ఈ ఎన్నికలకు సన్నద్ధం కావచ్చని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పరిస్థితులను బట్టి ఎన్నికల ప్రక్రియను ముందుకు జరపవచ్చనే చర్చ జరుగుతుంది. కేంద్రంలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేక మిత్రపక్షల మీద ఆధారపడే పరిస్థితి బీజేపీకి ఉండటంతో కొంత పునరాలోచనలో పడినప్పటికీ.. హర్యానా, మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో మరోసారి జమిలిపై బిజెపి వేగంగా ముందుకు కదులుతోంది.
మహారాష్ట్ర, హర్యానాల్లో బిజెపి తిరుగులేని విజయాలు సాధించడంతో కాంగ్రెస్ ఆత్మ రక్షణలో పడటం, ఎన్డియే మిత్ర పక్షాలన్నీ జమిలి విషయంలో బిజెపికి దన్నుగా నిలబడిన నేపథ్యంలో సవరణలను ముందుకు తీసుకెళ్లగలమని అధికారపక్షం భావిస్తోంది. ఇప్పుడు సగం రాష్ట్రాల్లో బిల్లును ఆమోదించుకోవడం ఎన్డీఏకు సమస్య కాదు. ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహించాలంటే ముందుగా రాజ్యాంగానికి ఆరు సవరణలు చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకు ఆరు బిల్లులు ప్రవేశపెట్టాలి. వీటిని పార్లమెంట్ లో మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పార్లమెంట్ లో ఎన్డీఏకు సాధారణ మెజార్టీ ఉందే తప్ప రెండో మెజారిటీ లేదు. రాజ్యసభలో 240 సీట్లు ఉండగా ఎన్డీఏ బలం 112 మాత్రమే. ప్రతిపక్షాలకు 85 సీట్లు ఉన్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లులో ఆమోదం పొందాలంటే 164 ఓట్లు అవసరం ఉంది. లోక్ సభలో మొత్తం 547 స్థానాలు ఉండగా ఎన్డిఏ 292 సీట్లు ఉన్నాయి. 2/3 మెజారిటీ అంటే 364 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. ఇక్కడే చిన్న మెలిక ఉంది. మొత్తం సభ్యులను పరిగణలోకి తీసుకోకుండా సభకు హాజరై ఓటు వేసిన వారిలో 2/3 శాతం మంది మెజారిటీ సరిపోతుందనే నిబంధన ఉండటంతో చివరి నిమిషంలో అనూహ్యమైన పరిణామాలకు కూడా అవకాశం ఉంటుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బిజెపి అగ్రనాయకత్వం జమీలిపై ముందుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.