తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్ లకు కేంద్ర షాక్ ఇచ్చింది.. వెంటనే ఎపీలో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది
కేంద్రం కీలక నిర్ణయం: ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్ లను ఏపీ కేడర్ కు కేటాయింపు
తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్ లకు కేంద్ర షాక్ ఇచ్చింది.. వెంటనే ఎపీలో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ఆయా ఐఏఎస్ అధికారుల పేరుతో లేఖలను రాస్తూ వాటి కాపీలను రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కేంద్రం పంపించింది. దీంతో వారిని తప్పక తెలంగాణ నుంచి రిలీవ్ చేయాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఈ ఇద్దరు తెలంగాణలో అతికీలక పోస్ట్ లలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ గా ఆమ్రపాలి , ట్రాన్స్కో, జెన్కో ఎండీ రొనాల్డ్ రోస్ లు విధులు నిర్వహిస్తున్నారు.వీరితో పాటు వాణిప్రసాద్, వాకాటి కరుణ, మల్లెల ప్రశాంతితో పాటు ఐపీఎస్లు అంజనీకుమార్, అభిలాషలు ఉన్నారు. పలువురు అధికారులను ఏపీ కేడర్కు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
అయితే, తెలంగాణ కేడర్ కావాలంటూ 11 మంది అధికారులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే, అధికారుల వినతిని కేంద్రం తిరస్కరించింది. అధికారులంతా సొంత రాష్ట్రంలో 16లోగా రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారులను రాష్ట్రానికి పంపించాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు చేసిన విజ్ఞప్తికి కేంద్రం ఓకే చెప్పింది.
ఏపీ, తెలంగాణ కేడర్ విభజనపై కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందిన తర్వాత ఆమ్రపాలి కేంద్ర సర్వీసుల నుంచి తెలంగాణ సర్వీసుల్లో చేరారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించారు. జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్, మూసీ రివర్ ఫ్రంట్ మేనేజింగ్ డైరెక్టర్, హెచ్జీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కమిషనర్గా కొనసాగుతున్న సమయంలోనే జీహెచ్ఎంసీ కమిషనర్ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలో ఎంతో మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నప్పటికీ ఆమెకే ఐదు కీలక పోస్టులను సీఎం రేవంత్రెడ్డి కేటాయించారు. ఆ తర్వాత జరిగిన బదిలీల్లో మిగతా పోస్టులను నుంచి ఆమెను జీహెచ్ఎంసీ కమిషనర్గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. తాజా కేంద్రం నిర్ణయంతో ఆమె ఏపీకి వెళ్లనున్నారు.