ఒకాయన ఆల్ఫోర్స్ కాలేజీల అధినేత.. పేరు నరేందర్ రెడ్డి. ఇంకొకాయన ప్రభుత్వ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ (రిజైన్డ్).. పేరు ప్రసన్న హరికృష్ణ. నరేందర్ రెడ్డికి తెలంగాణ వ్యాప్తంగా వందల కార్పొరేట్ కాలేజీలున్నాయి. లక్షల్లో ఫీజులు వసూలు చేసే విద్యాసంస్థలు ఉన్నాయి. ప్రసన్న హరికృష్ణ ప్రభుత్వ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసి రిజైన్ చేశారు.
నరేందర్ రెడ్డి, ప్రసన్న హరికృష్ణ
కరీంనగర్, ఈవార్తలు : మరో ఎన్నికకు తెలంగాణ సమయాత్తమైంది. నిజామాబాద్-కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్ (గ్రాడ్యుయేట్స్), నిజామాబాద్-కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్ (టీచర్స్), వరంగల్-ఖమ్మం-నల్గొండ (టీచర్స్) స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో గ్రాడ్యుయేట్స్ ఎన్నిక రసవత్తరంగా మారే చాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మాజీ మంత్రి, జగిత్యాలకు చెందిన కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఈయన పదవీకాలం మార్చి 29తో ముగియబోతోంది. ఈ నేపథ్యంలో ఆ స్థానంలో పోటీ చేసేందుకు పలువురు విద్యావంతులు బరిలో దిగుతున్నారు. వారిలో కొందరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అందులో ఒకాయన ఆల్ఫోర్స్ కాలేజీల అధినేత.. పేరు నరేందర్ రెడ్డి. ఇంకొకాయన ప్రభుత్వ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ (రిజైన్డ్).. పేరు ప్రసన్న హరికృష్ణ. నరేందర్ రెడ్డికి తెలంగాణ వ్యాప్తంగా వందల కార్పొరేట్ కాలేజీలున్నాయి. లక్షల్లో ఫీజులు వసూలు చేసే విద్యాసంస్థలు ఉన్నాయి. ప్రసన్న హరికృష్ణ ప్రభుత్వ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసి రిజైన్ చేశారు. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాకున్నా.. వీరిద్దరు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలో రేసు గుర్రాలుగా బరిలో ఉన్నారు.
గత 3-4 నెలల నుంచే నరేందర్ రెడ్డి ప్రచారం
ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి 3-4 నెలల నుంచే ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ హోర్డింగులు దర్శనం ఇస్తున్నాయి. ప్రతి చానల్కు ఇంటర్వ్యూలు ఇస్తూ గ్రాడ్యుయేట్స్ ఓట్లను ఒడిసిపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తన విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులతో ఆయన టచ్లోకి వెళ్లారని, వారి ఓట్లు అభ్యర్థిస్తున్నారని సమాచారం. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఈయన.. తన పట్టు నిలుపుకొనేందుకు పెద్ద పార్టీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. టికెట్ రాకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని యోచిస్తున్నట్టూ తెలిసింది. అయితే, లక్షల్లో ఫీజులు వసూలుచేసే ఆల్ఫోర్స్ కాలేజీల పట్ల చాలా మంది గ్రాడ్యుయేట్లలో వ్యతిరేకత ఉంది. విద్యార్థుల నుంచి రక్తం పిండినట్లు ఈ కాలేజీల్లో ఫీజులు వసూలు చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి.
చాప కింద నీరులా ప్రసన్న హరికృష్ణ ప్రచారం
ప్రభుత్వ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసిన ప్రసన్న హరికృష్ణ.. విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నారు. ఈయన కూడా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. భారీ ఎత్తున ప్రచారం చేయకపోయినా.. గ్రాడ్యుయేట్లను కలుస్తూ వారితో మమేకమవుతున్నారు. తాను చదువు చెప్పిన విద్యార్థులతో నిత్యం టచ్లో ఉంటున్నారు. ఎక్కడికి వెళ్లినా గ్రాడ్యుయేట్స్లో సానుకూలత కనిపిస్తోంది. విన్నర్స్ పబ్లికేషన్స్ పేరుతో పబ్లిష్ అయ్యే ఈయన పుస్తకాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రభుత్వ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి ప్రసన్న హరికృష్ణ బుక్స్ మంచి గైడెన్స్. గౌడ సామాజిక వర్గానికి చెందిన ఈయన.. గెలుపే ప్రధాన లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈయన కూడా ఓ పార్టీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. రాజకీయ సాధికరత సాధించే దిశగా బీసీలు అడుగులు వేస్తున్న క్రమంలో.. బీసీ ఓట్ షేర్ ఈయనకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈమధ్యే బీసీ ప్రతినిధులు ఈయనను కలిసి మద్దతు ప్రకటించారు.
ప్రస్తుతం వీరిద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ముందంజలో ఉన్నారు. ఈ మధ్య కాలంలో బీసీల్లో ఐక్యత పెరుగుతోంది. పలు చోట్ల సమావేశాలు నిర్వహించి బీసీ అభ్యర్థికే ఓటు వేయాలని బీసీ సంఘాల ప్రతినిధులు అభ్యర్థిస్తున్నారు. ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న గెలుపు కూడా బీసీ ఎజెండాలో భాగమేనన్నది అందరికీ తెలిసిందే. ఇదే నిజమైతే అత్యధిక సంఖ్యలో ఉండే బీసీలు మరోసారి బీసీ అభ్యర్థికే ఓటు వేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అదే నిజమైతే ప్రసన్న హరికృష్ణకు ప్రస్తుత పరిస్థితులు కలిసి రానున్నాయి.