తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఒక పుస్తకాన్ని గిఫ్ట్గా అందజేశారు. ఆ పుస్తకం పేరు.. నా గొడవ. తెలంగాణ ప్రముఖ కవి కాళోజీ రచించిన పుస్తకం అది.
కాళోజీ రచించిన నా గొడవ పుస్తకం
హైదరాబాద్, ఈవార్తలు : హైదరాబాద్లోని ప్రజాభవన్లో జరిగిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఒక పుస్తకాన్ని గిఫ్ట్గా అందజేశారు. ఆ పుస్తకం పేరు.. నా గొడవ. తెలంగాణ ప్రముఖ కవి కాళోజీ రచించిన పుస్తకం అది. ప్రస్తుతం అంతటా ఆ పుస్తకం గురించే చర్చ జరుగుతోంది. ఒక సీఎం.. ఇంకో సీఎంకు ఇచ్చే అంత గొప్ప పుస్తకమా? అని తెలియని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఆ పుస్తకం ఎంత శక్తివంతమైనదంటే.. అందులోని ఒక లైన్ చదివితే అర్థం అవుతుంది. ఉదాహరణకు ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి.. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి.. అన్యాయాన్నెదిరించినోడు నాకు ఆరాధ్యుడు..’ అని కాళోజీ తన నా గొడవ పుస్తకంలో రాశారు.
కాళోజీ పూర్తి పేరు.. రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ. కాళోజీ నారాయణరావు, కాళోజీ, కాళన్నగా సుపరిచితుడు. ఆయన తెలంగాణ ఉద్యమ ప్రతిధ్వని అని అనొచ్చు. కవిత్వంలో కవిగా.. హక్కులపై నిలదీసిన ప్రజల మనిషిగా.. ఉద్యమంలో పాల్గొన్న ప్రజావాదిగా తెలంగాణ ప్రజలకు సుపరిచితుడు. నిజాం దమననీతిని, నిరంకుశత్వాన్ని కలాన్నెత్తి ఖండించాడు. ప్రస్తుతం ఆయన జయంతిరోజునే తెలంగాణ భాషా దినోత్సవం జరుగుతోంది. వాస్తవానికి కాళోజీ తల్లిదండ్రులు తెలంగాణవాళ్లు కాదు. ఆయన తల్లి రమాబాయమ్మ (కన్నడ), తండ్రి రంగారావు (మహారాష్ట్రీయుడు).. కానీ, తెలంగాణ నీళ్లు ఆయన నరనరాన చేరాయి. రక్తమై నిరంతరం మరిగాయి.
నా గొడవ పుస్తకం ప్రత్యేకత ఇదీ..
పాలకులపై అక్షరాయుధాలు సందించిన ఈ పుసక్తంలో.. సమకాలీన సామాజిక సమస్యలపై ముక్కుసూటిగా, కటువుగా బయటపెట్టారు కాళోజీ. ఒక మాటలో చెప్పాలంటే నా గొడవ.. తెలంగాణ ప్రజల అందరి గొడవ. 450 పేజీల ఈ పుస్తకాన్ని ఒకసారి చదవటం మొదలుపెడితే చివరిదాకా చదివిస్తుంది.