కోర్టుకు వస్తారా.. జైలుకు పంపాలా.. అంటూ రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యాహ్నం వరకు కోర్టులో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్, ఈవార్తలు : కోర్టుకు వస్తారా.. జైలుకు పంపాలా.. అంటూ రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యాహ్నం వరకు కోర్టులో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు కోర్టు ఆర్డర్ ఇల్లీగల్ అంటూ బాధితురాలిపై క్రిమినల్ కేసు నమోదు చేయించిన కేసులో జిల్లా కలెక్టర్పై హైకోర్టు మండిపడింది. తనకున్న అధికారాన్ని ఉపయోగించి బాధితురాలిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించడన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. తన ఇల్లు మిడ్ మానేరులో పోయిందని, ఆర్అండ్ఆర్ చట్టం ప్రకారం తనకు పునరావాసం కల్పించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అనుపురం గ్రామానికి చెందిన వనపట్ల కవిత అనే నిర్వాసితురాలు హైకోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘ కాలం విచారణ అనంతరం కవితకు అర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రకారం పునరావాసం కల్పించాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. తీర్పు మేరకు తనకు పునరావాసం కల్పించాలని బాధితురాలు జిల్లా కలెక్టర్ను కోరింది.
అయితే.. కోర్టును తప్పుతోవ పట్టించి ఇల్లీగల్ ఆర్డర్ తీసుకొచ్చారన్న అభియోగంతో పిటిషనర్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వేములవాడ ఆర్డీవోకు కలెక్టర్ లిఖితపూర్వక ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాలతో బాధితురాలు కవితపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీంతో బాధిత మహిళ. తనకు జరిగిన అన్యాయంపై తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు తీర్పును ధిక్కరించండమే కాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడి కేసు నమోదు చేయడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. వెంటనే కలెక్టర్ కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. నిన్న ఉదయం కోర్ట్కు హాజరు కావాల్సి ఉండగా గైర్హాజరైన కలెక్టర్, మధ్యాహ్నం వరకు కోర్టులో ఉండకపోతే జైలుకు పంపుతామని ప్రభుత్వ తరపు న్యాయవాదికి న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీంతో.. మధ్యాహ్నం కోర్టుకు కలెక్టర్ హాజరయ్యారు. న్యాయమూర్తి 2 గంటల పాటు కలెక్టర్ను కోర్టులో నిలబెట్టి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు తప్పు అని ఎలా అంటారని నిలదీశారు. బాధితురాలిపై కేసు ఎలా నమోదు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ధిక్కరణ కింద జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? అని హెచ్చించారు. దీంతో.. తాము మాట్లాడిన మాటలు తప్పేనని ఒప్పుకొని కలెక్టర్ బేషరతు క్షమాపణ కోరారు.